బంజారాహిల్స్, ఫిబ్రవరి 25: వీధికుక్కల బెడదను నివారించేందుకు జీహెచ్ఎంసీ తరఫున అన్ని చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకుంటున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం పంజగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అంబర్పేటలో వీధికుక్కల దాడిలో బాలుడు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి దారుణమైన ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని పేర్కొన్నారు. చికెన్షాపులు, మటన్ మార్కెట్ల యజమానులు మాంసం వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారని, ఇలాంటి అలవాట్లను మానుకోకపోతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నగర మేయర్ను టార్గెట్ చేస్తూ సోషల్మీడియాతో పాటు న్యూస్ చానెల్స్లో కథనాలు ప్రసారం చేస్తుండటాన్ని ఖండిస్తున్నామన్నారు. దర్శకుడు రాంగోపాల్వర్మ మహిళా మేయర్ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, రాములు పాల్గొన్నారు.