Hyderabad | సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ( Outer Ring road ) ప్రగతికి దిక్సూచిగా మారింది. నగరం చుట్టూ 158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో అభివృద్ధికి కేరాఫ్గా మారుతున్నది. కొత్తగా వచ్చే దేశ, విదేశీ కంపెనీలు ఎయిర్పోర్ట్ కనెక్టవిటీ ( Airport Connectivity ) సులభంగా ఉండడంతో ఔటర్ చుట్టే తమ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నాయి. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణం ఉండడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. తెలుగు రాష్ర్టాలతో పాటు దేశ, విదేశీ రియల్టీ సంస్థలు ఆకాశహర్మ్యాలను ఔటర్ చుట్టే నిర్మిస్తున్నాయి. నివాస, వ్యాపార భవనాలే కాకుండా ఫార్మా, లైఫ్సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు ఔటర్ చుట్టూ ఏర్పాటవుతుండడంతో ఔటర్ రింగు రోడ్డు సరికొత్త హాట్స్పాట్గా మారిపోయింది.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్నాయి. మహానగరానికి మణిహారంలా మారిన 158 కి.మీ ఓఆర్ఆర్ చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి. ఓఆర్ఆర్ నుంచి అత్యంత మెరుగైన రోడ్ల అనుసంధానం కోర్ సిటీకి ఉండడంతో శివారు ప్రాంతాల్లోనూ కొత్తగా తమ ప్రాజెక్టులను చేపట్టేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ వైపు మాత్రమే కాకుండా దక్షిణ, ఉత్తర, తూర్పు దిక్కుల వైపు ఉన్న ఓఆర్ఆర్కు ఇరువైపులా కొత్తగా ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. 2012 నుంచి దశల వారీగా అందుబాటులోకి వచ్చిన ఓఆర్ఆర్ 2018 నాటికి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగిస్తూ, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒకప్పుడు నగర శివారులో ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఐటీ రంగం అభివృద్ధితో ఐటీ కారిడార్లో భాగంగా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాలకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలే కాకుండా దేశ, విదేశీ రియల్టీ సంస్థలు సైతం ఇక్కడ భారీ ఎత్తయిన ఆకాశహర్మ్యాలను 10 నుంచి 59 అంతస్థుల దాకా నిర్మిస్తున్నాయి. నివాస, వ్యాపార భవనాలే కాకుండా ఫార్మా, లైఫ్సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగాలకు చెందిన పరిశ్రమలు ఔటర్ చుట్టూ కొత్తగా ఏర్పాటవుతూనే ఉన్నాయి. దీంతో ఔటర్ రింగు రోడ్డు అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా మారిపోయింది.
హైదరాబాద్ మహానగరం నలుమూలలా విస్తరిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అందులో భాగంగానే విస్తరిస్తున్న మహానగరానికి 50 ఏళ్ల వరకు సరిపడేలా వసతుల కల్పన శ్రీకారం చుట్టింది. మంచినీటి సరఫరా కోసం గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చే పైపులైను మార్గాలను కలుపుతూ ఓఆర్ఆర్ చుట్టూ రింగు మెయిన్ పేరుతో భారీ పైపు లైను నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న మెట్రో రైలు సౌకర్యాన్ని సైతం ఐటీ కారిడార్లోని రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో ఎక్స్ప్రెస్ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్కు 4 చోట్ల రైల్వే మార్గాలు అనుసంధానమై ఉండగా, వాటికి సమీపంలోనే కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్ను నిర్మించాలన్న ప్రతిపాదనను రూపొందించారు. కోర్ సిటీ నుంచి ఔటర్ వరకు 33 రేడియల్ రోడ్డు నిర్మిస్తూ శివారు ప్రాంతాలకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థలను సైతం విస్తరిస్తున్నారు.
ఔటర్ మార్గం ప్రగతి హారంగా మారడంతో ఓఆర్ఆర్ అభివృద్ధిపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓఆర్ఆర్ చుట్టూ మొదట 22 ఇంటర్చేంజ్లతో నిర్మిస్తే, తర్వాతి కాలంలో జరుగుతున్న అభివృద్ధిని, అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో 3 చోట్ల( నార్సింగి, కోకాపేట, మల్లంపేట) కొత్తగా ఇంటర్చేంజ్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 3 చోట్ల పనులు ముమ్మరంగా జరుగుతుండగా, నార్సింగిలో చేపట్టిన ఇంటర్చేంజ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. దీంతో కోర్ సిటీ నుంచి ఓఆర్ఆర్కు చేరుకొని అక్కడి నుంచి ఎక్కడికైనా సరే వేగంగా వెళ్లేలా రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్చేంజ్ల నుంచి కోర్ సిటీకి వెళ్లాలన్నా, జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలు అత్యంత సులభంగా సాగించేలా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.
ఐటీ రంగానికి ఆయువు పట్టులాంటి డేటా సెంటర్లు సైతం హైదరాబాద్ కేంద్రంగా భారీ విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలే ఔటర్ రింగు రోడ్డు బయట భారీ ఎత్తున డేటా సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాయి. ఈ మూడు కంపెనీలే కాకుండా దేశీయ, విదేశీ కంపెనీలు సైతం మరిన్ని డేటా సెంటర్లను నగర శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు డేటా సెంటర్లకు అత్యంత అనుకూలంగా ఉన్నట్లు గుర్తించిన ప్రైవేటు సంస్థలు 20 నుంచి 50 ఎకరాల్లో భారీ విస్తీర్ణంతో కూడిన డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టాయి.
ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటి తరలించాలన్న లక్ష్యం పెట్టుకొని కార్యాచరణ అమలు చేయడంతో కొత్తగా పరిశ్రమలన్నీ ఔటర్ బయటే వస్తున్నాయి. మహేశ్వరం, తుక్కుగూడ, కొంగర కలాన్ ప్రాంతాల్లో ఫ్యాబ్ సిటీ, ఈ-సిటీ వంటివి రాగా, ముచ్చర్ల సమీపంలో దేశంలోని అతి పెద్దదైన ఫార్మాసిటీ నిర్మాణం పురోగతిలో ఉంది. వీటితో పాటు శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్లే మార్గంలో చందన్వెల్లి, సీతారాంపూర్లలో రెండు పారిశ్రామిక వాడలు కొత్తగా ఏర్పాటయ్యాయి. అదేవిధంగా పటాన్చెరువు- మేడ్చల్ల మధ్య సుల్తాన్ పూర్ వద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటైంది. తూర్పు వైపున పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ దాటిన తర్వాత బాట సింగారం లాజిస్టిక్ పార్కు, మంగల్పల్లి వద్ద మరో లాజిస్టిక్ పార్కు నిర్మాణాలు జరుపుకొని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక చౌటుప్పల్ సమీపంలోని దండు మల్కారంలో చిన్న తరహా పరిశ్రమల కోసం వేయికి పైగా ఎకరాల్లో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటైంది. ఇలా నగరం చుట్టూ ఓఆర్ఆర్ను కేంద్రంగా చేసుకొని పారిశ్రామిక వాడలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా రాష్ట్రంలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ దిల్సుక్నగర్, కొత్తపేట ప్రాంతాల మధ్య నుంచి ఔటర్ రింగు రోడ్డు పక్కన కొహెడలోని 100 ఎకరాల్లో శాశ్వత మారెట్ నిర్మాణ పనులు చేపట్టారు.
గ్రేటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న ఔటర్ రింగు రోడ్డును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటూ క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేస్తున్నది. 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్ 19 చోట్ల ఇంటర్ చేంజ్లు ఉన్నాయి. ఓఆర్ఆర్పై వచ్చే వాహనదారులు సులభంగా తాము వెళ్లాల్సిన మార్గం, గమ్య స్థానాన్ని తెలుసుకునే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్, కేంద్ర ఉపరితల రవాణా సంస్థ రూపొందించిన రహదారుల ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని వాటిని ఓఆర్ఆర్పై అవసరమైన చోట ఏర్పాటు చేయిస్తున్నారు. మొత్తంగా ఔటర్పై ప్రమాదాల నివారణే ఏకైక లక్ష్యంగా ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ రోడ్డు మార్గాలను తీర్చిదిద్దుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి ఐటీ కారిడార్లో ఆకాశమే హద్దుగా అభివృద్ధి చోటు చేసుకుంది. అది అంతటితో ఆగకుండా ఓఆర్ఆర్ను కేంద్రంగా చేసుకొని ఐటీ కారిడార్ విస్తరణ పడమర, దక్షిణం వైపునకు క్రమంగా విస్తరిస్తున్నది. 2014 నాటికి మాదాపూర్ నుంచి గచ్చిబౌలి వరకే పరితమైన ఐటీ కంపెనీలు, గత 9 ఏళ్లలో నానక్రాంగూడ, నార్సింగి, పుప్పాల్గూడ మీదుగా కోకాపేట వరకు విస్తరించగా, అదే సమయంలో నివాస ప్రాంతాలు శంకర్పల్లి, మోకిల, కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, పటాన్చెరువు, ఇస్నాపూర్ వరకు, మంచిరేవుల, తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు, మియాపూర్, నిజాంపేట మీదుగా బాచుపల్లి, దుండిగల్, అమీన్పూర్ వరకు విస్తరించాయి. 5 ఎకరాల నుంచి 50 కరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు సైతం ఓఆర్ఆర్కు ఇరువైపులా వెలిశాయి. కొత్తగా మరిన్ని నివాస ప్రాజెక్టులు రాబోతున్నాయి.