పహాడీషరీఫ్: కుక్కలు బాబోయ్ కుక్కలు ..పగలు రాత్రి అనే తేడా లేకుండా కాలనీ, బస్తీలలో ప్రధాన రహదారుల్లో, చెత్త డంపింగ్ వద్ద కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడితో వాహనదారులు, పాదచారులు బెదిరిపోతున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వాది ఏ ముస్తఫా, వాది దా కాలనీలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో కుక్కలు తిరుగు తున్నాయి. ఏ వీధి చూసిన కుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. వాది ఏ ముస్తఫా కాలనీలోని చెత్త డంపింగ్ వద్ద పెద్ద ఎత్తున కుక్కలు చేరుతున్నాయి.
ఉదయం వాకింగ్ పోయేవారు, ద్విచక్రవాహనాలపై వెళ్లే వారి వెంట పడి తరుము తున్నాయి. ఇటీవల వాది దాలో ఉమేదుల్లాకు చెందిన 16 మేకలను, అబ్దుల్లా రహిమాన్కు చెందిన 6 మేకలను, ఉమర్కు చెందిన 4 మేకలపై దాడి చేసి చంపేసాయి. దీంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారులపై, వృద్దులపై కూడా పలుమార్లు దాడి చేసి గాయపరిచిన ఘటనలు ఉన్నాయని దీంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తోందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో చుక్కలే..
ఉదయం వేళల్లో కంటే రాత్రి వేళల్లో కుక్కలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాళ్లు తీసుకొని కొట్టినా వెంటపడి తరుముతున్నాయి. అతి కష్టం మీద వాటి బారి నుంచి తప్పించుకుని ఇళ్లకు చేరుకునే సరికి చుక్కలు కనిపిస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారని చర్యలు తీసుకోవాలని జీఎచ్ఎంసీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను పట్టుకొని తీసుకెళ్లాలని కోరుతున్నారు.
కుక్కల బారి నుంచి కాపాడండిః ఒబిద్ భాయి, వాది దా
కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. రాళ్లతో కొట్టిన పారి పోకుండా కొడుతున్న వారిపై దాడికి దిగుతున్నాయి. గత నెల క్రితం తన మామకు చెందిన మేకల మందపై దాడి చేసి 16 మేకలను చంపేశాయి. కుక్కలను పట్టుకెళ్లి వాటి దాడి నుంచి రక్షణ కల్పించాలని జీఎచ్ఎంసీ అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాము. ఇంత వరకు అధికారులు స్పందించలేదు. అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలి
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదుః స్సేన్, వాది ఏ ముస్తఫా కాలనీ టీఆర్ఎస్ అధ్యక్షుడు
బస్తీలో కుక్కల బెడద ఎక్కువైంది. రాత్రివేళలో ఇంటి ముందు నిల్చున్న మనుషులపై, మేకల మందపై దాడి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేసే చోటు నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, ఇంటి నుంచి దుకాణాలకు వెళ్లేటప్పుడు చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు జీఎచ్ఎంసీ అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. అటు జీఎచ్ఎంసీ ఇటు మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికైన త్వరగా సమస్యను పరిష్కరించాలి.