మాచారెడ్డి, మే 9 : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయి ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్గౌడ్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తండా గ్రామ పరిధిలోని చంద్రునాయక్ తండాకు చెందిన లావుడ్యా శ్రీనుకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు శ్రీకాంత్, నవీన్ (21) ఉన్నారు. ఆటోడ్రైవర్గా పనిచేసే శ్రీను అనారోగ్యంతో ఏడాది క్రితం మృతి చెందాడు. పేద కుటుంబం, రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు.
తల్లి మక్క బుట్టలు అమ్ముతుండగా, చిన్న కుమారుడు నవీన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో సరిగా నడువక ఆదాయం పడిపోయింది. దానికితోడు ఆటో తరచూ సతాయిస్తుండటంతో అప్పు తెచ్చి మరమ్మతు చేయించాడు. అయినా ఫలితం లేకపోవడంతో దాన్ని అమ్మేసి మరోటి కొన్నాడు. అదీ కూడా సరిగా నడువకపోవడంతో ఇబ్బందులకు గురయ్యాడు. అప్పటికే తెచ్చిన అప్పుకు వడ్డీ భారం పెరిగిపోవడం మనస్తాపానికి గురైన నవీన్ గురువారం ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.