బన్సీలాల్పేట్, మే 25: పీజీ వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యుల దాడిని ఖండిస్తూ సోమవారం గాంధీ దవాఖాన వైద్యులు విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు శ్రమిస్తున్న డాక్టర్లపై భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రభుత్వ వైద్యుల సంఘం, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్ అన్నారు. అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అంతస్తులో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న జూడాలతో డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.