Heavy Rains | సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): “కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అందరం ఫీల్డ్లోనే ఉన్నాం.. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రజలు కూడా పోలీసులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలి”.. అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీపీ కొన్ని సూచనలు చేశారు. వర్షాలు కురుస్తున్న సమయంలో అనవసరంగా బయటకు రావద్దు.. అత్యవసరమైతేనే బయటకు రావాలి.. చాలా చోట్ల వాగులు, నాలాలు, కుంటలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.. వాటి నుంచి వచ్చే వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది.. వరద ఉధృతి వద్దకు, నిండుకుండలా ఉన్న జలాశయాల వద్దకు వెళ్లడం ప్రమాదకరం.. వాటికి దూరంగా ఉండండి.. వర్షం కురుస్తున్న సమయంలో పొలాల్లో ఉన్న విద్యుత్ మోటర్ల వద్దకు వెళ్లకండి.. కరెంటు తీగలు, స్తంభాలు, మోటర్లను తాకవద్దు.. వాటికి దూరంగా ఉండడం మంచిది.. అని సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రభావిత ప్రాంతాలు, చెరువులు, వాగుల పరిస్థితిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షించారు.
ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర, అదనపు సీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న బిగ్ స్క్రీన్పై లైవ్లో సీసీటీవీల ద్వారా పరిస్థితులను పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీసులంతా ఫీల్డ్లోనే ఉన్నారని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా నిర్విరామంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వర్షంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఐఎండీ వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులను మూడు షిఫ్టుల వారీగా లాగౌట్ చేసి, ఇండ్లకు పంపే విధంగా ఇప్పటికే ఆయా కంపెనీలకు సూచించామన్నారు. ఈ పద్ధతిని మరో రెండు మూడు వారాల పాటు కొనసాగిస్తామన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని, పోలీసులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరిస్తూ వారి సూచనలను పాటించాలన్నారు. జలాశయాలు, వరద ప్రవాహా ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. వరద ప్రాంతాలకు ప్రజలు వెల్లకుండా అధికారులు బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ట్రాఫిక్ మళ్లించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు 24 గంటలపాటు పోలీసులు అందుబాటులో ఉంటారని, ఏదైనా సహాయం కోసం 100 నంబర్కు గానీ.. స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.