చాదర్ఘాట్ : దివ్యాంగులైన క్రీడాకారులను ఆదుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్ర, తెలంగాణ వీల్ చైర్స్ క్రికెట్ మ్యాచ్లో రాష్ట్రానికి చెందిన జట్టు విజయం సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్లో రెండు రోజుల పాటు జరిగిన 3 మ్యాచ్ల టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రం సిరీస్ ను కైవసం చేసుకుంది. తెలంగాణ క్రికెట్ టీంకు ఫారుఖ్ అహ్మద్, ఏపీకు ప్రవీణ్కుమార్ కెప్టెన్లుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రధానోత్సవానికి కొల్లి నాగేశ్వర్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సకలాంగుల క్రీడాకారులకు కల్పించే సౌకర్యాలను దివ్యాంగ క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దివ్యాంగ క్రీడాకారులకు 4శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీ.సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.