మేడ్చల్, జనవరి 26(నమస్తే తెలంగాణ): సమగ్ర అభివృద్ధి, మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యం అని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం భారత గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గౌతమ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అభయ హస్తం పథకంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు యువ వికాసం వివిధ పథకాలకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి కంప్యూటరీకరణ చేసి పథకాల వారీగా వివరాలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందన్నారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద బాలికలు, మహిళలు, ట్రాన్స్ డెంజర్స్కు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు సౌకర్యంలో ఇప్పటి వరకు కోటి 20 లక్షల మంది జిల్లాలో ప్రయాణించినట్లు వెల్లడించారు.
జిల్లాలో టీఎస్-ఐపాస్ 2014 చట్టం కింద జిల్లాలో ఇప్పటి వరకు 6 వేల 277 ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వివిధ శాఖల నుంచి 10 వేల 793 అనుమతులు ఇప్పించినట్లు కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకవెళ్లాలని ఆ దీశగా జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను కలెక్టర్ గౌతమ్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి డీసీపీ నిఖితా పంత్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. విధులలో ప్రతిభ కనబర్చిన 117 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.