మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 28: జిల్లాలో కారుణ్య నియామకాలు పూర్తి చేశామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు, హరితహారం, ఆసరా పింఛన్, గొర్రెల పంపిణీ, బీసీ, మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం, గృహలక్ష్మి, దళిత బంధు, ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, కారుణ్య నియామకాలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేశామని కలెక్టర్ సీఎస్కు వివరించారు. రెండవ విడత గొర్రెలు పంపిణీ చేశామని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి దరఖాస్తులు అన్లైన్లో నమోదు చేశామని, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలు జిల్లాలో లబ్ధిదారులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఎంపిక చేశామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.