బేగంపేట్, సెప్టెంబర్ 30: ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి.. ఆశీర్వదిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలకు మరింత మేలు జరుగుతుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో 300 మంది ముస్లిం మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు, 80 మంది ముస్లిం మైనార్టీ మహిళలకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… ముస్లిం మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే క్రిస్మస్, రంజాన్ వంటి గొప్ప గొప్ప పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా పేదలు కూడా పండుగలను గొప్పగా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నూతన దుస్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్లను అందిస్తున్న విషయాలను గుర్తు చేశారు. అదే విధంగా పేదింటి ఆడపచుల పెండ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా షాదీ ముబారక్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్తీలోని కమ్యూనిటీ హాళ్లలో మరిన్ని శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేటర్ జిల్లా అధికారి ఎలియాస్ అహ్మద్, కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, రూప, అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.