వెంగళరావునగర్, ఏప్రిల్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మత ఘర్షణలకు తావులేకుండా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆదివారం రహ్మత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన సొంత ఖర్చులతో సమకూర్చిన రంజాన్ కానుకలను 1600 మంది ముస్లిం సోదర, సోదరీమణులకు కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాగంటి మాట్లాడుతూ..మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రభ్రుత్వం కోట్లాది రూపాయలను కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఢీకొనే సత్తా ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్కే ఉందని అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ స్థాపించినట్లు తెలిపారు. బీజేపీ శ్రేణులు కుల,మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదన్నారు. ఇక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు.
రంజాన్ పండుగ రోజున ఈద్ నమాజ్ చేసుకునే వసతుల్లేక ఇన్నాళ్లు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఒకేసారి 10 వేల మంది ఈద్ నమాజ్ చేసుకునేలా వసతులను కల్పిస్తున్నామని ఇందుకు సం బంధించి ఏర్పాట్లు కల్పించాలని బల్దియా అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే మాగంటి తెలిపారు. ఈద్ నమా జ్ చేసుకోవడానికి వచ్చే ముస్లిం సోదరులకు అవసరమైన నీటి వసతులతో పాటు నమాజ్ చేసుకోవడానికి అవసరమై అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీం తో ముస్లిం సోదరులు కరతాళ ధ్వనులతో ఎమ్మెల్యే మాగంటికి కృతజ్ఞతలు తెలిపారు. మాటలు చెప్పి కాలం గడిపేవాళ్లం కాదని.. మనస్సు పెట్టి పని చేసే ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ముస్లింలకు తాను అండగా నిలుస్తానని.. సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు, శ్రీనివాస్, నాయకులు నజీర్, గని, జబ్బార్, షరీఫ్, ఫయాజ్, గాఫూర్ తదితరులు పాల్గొన్నారు.