అబిడ్స్, జూన్ 9 : మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబీకులు చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో మూడేండ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీ ఈ సంవత్సరం తిరిగి ప్రారంభమైంది. ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం వరకు ఉబ్బస వ్యాధిగ్రస్తులు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి తరలివచ్చి చేప ప్రసాదాన్ని స్వీకరించారు. మత్స్యశాఖ అధికారులు లక్షల కొర్రమీన్లను సిద్ధంగా ఉంచి 32 కౌంటర్ల ద్వారా ఒక కొర్రమీను టోకెన్ను రూ.40 చొప్పున విక్రయించారు. టోకెన్ పొందిన వారికి 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు చేప ప్రసాదం పంపిణీ నిరవధికంగా కొనసాగింది.
అభినందించిన మంత్రి తలసాని..: చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అభినందనలు తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతిఒక్కరికి చేప ప్రసాదం పంపిణీ చేసిన బత్తిని హరినాథ్గౌడ్, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. అలాగే ఉబ్బస వ్యాధిగ్రస్తులు, సహాయకులకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందించిన స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లు, జీహెచ్ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, వాటర్ వర్క్స్, శానిటేషన్, ఫైర్, మత్స్య, ఆర్అండ్బీ, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.