సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిన సోదరులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 25వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ చేయలేదని, ఈ సంవత్సరం నుంచి చేప ప్రసాదం పంపిణీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చేప ప్రసాదం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి లక్షలాది మంది వస్తుంటారని చెప్పారు. సాధారణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు వేరు వేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా బారీకేడ్లు, తాగునీటి సౌకర్యం, అత్యవసర వైద్యసేవలు అందించడానికి హెల్త్ క్యాంప్లు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైన చేప పిల్లలను కూడా ప్రభుత్వమే మత్స్య శాఖ ద్వారా సరఫరా చేస్తుందని పేరొన్నారు. ఈ సమావేశంలో బత్తిన సోదరులు గౌరీ శంకర్ గౌడ్, శివశంకర్ గౌడ్, అమర్నాథ్ గౌడ్, అలకానంద తదితరులు పాల్గొన్నారు.