బంజారాహిల్స్, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పండుగలను అధికారింగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి పాలకుడు దేశంలో ఎవరూ లేరని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అమ్మవారి ఆలయాలవద్ద బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని బంజారాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్నగర్ డివిజన్ల పరిధిలోని 106 అమ్మవారి ఆలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3.76 కోట్ల విలువైన చెక్కులను ఆలయ కమిటీ నాయకులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల పండుగలను ప్రతిబస్తీ, కాలనీల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటామని, గతంలో బోనాల పండుగ వచ్చిందంటే అమ్మవారి ఆలయాలవద్ద ఏర్పాట్ల కోసం ఆలయ కమిటీల నాయకులు ఇబ్బంది పడేవారన్నారు.
అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని మతాలకు సంబంధించిన పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలవద్ద ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా నిధులు అందజేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం పండుగలకు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. ప్రజల అవసరాలను నిరంతరం గమనిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ఒకవైపు సంక్షేమంతో పాటు అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్గా నిలిచేలా తెలంగాణను తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బోనాల పండుగ కోసం కొన్ని పెద్ద ఆలయాలకు నిధులు తక్కువగా వచ్చాయని, అలాంటి ఆలయాల నిర్వాహకులు లేఖలు ఇస్తే అదనంగా నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కవితారెడ్డి. వనం సంగీతాయాదవ్, వెంకటేశ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, రాంచందర్, అరుణ్కుమార్, మహేందర్బాబు, షేక్ అహ్మద్, దీపాదేవి తదితరులు పాల్గొన్నారు.