BJP | కమలం నేతల రాజకీయాలు రోజు రోజుకు బురదస్థాయికి దిగజారుతున్నాయి. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీభత్సం సృష్టించిన బీజేపీ నేతలు.. మంగళవారం జలమండలి కార్యాలయంలో నానా రచ్చ చేశారు. తాము బాధ్యత గల కార్పొరేటర్లమని మరిచి నిరసన ముసుగులో విచ్చలవిడిగా వ్యవహరించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. నగరంలో డ్రైనేజీ సమస్య ఉందంటూ జలమండలి కార్యాలయం వద్ద భయానక వాతావరణాన్ని సృష్టించారు. అంతటితో ఆగకుండా కార్యాలయంలోకి దూసుకొచ్చి వారి వెంట తెచ్చిన సిల్ట్ (సీవరేజి పూడికతీత మట్టి)కార్యాలయంలో ఇష్టారీతిన చల్లారు. మొదటి అంతస్తులో ఎండీ చాంబర్ ఎదుట పూలకుండీలను ధ్వంసం చేశారు.
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : కార్పొరేటర్లుగా ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయాలని. అంతేకానీ ప్రతిపక్షం ముసుగులో బాధ్యత లేకుండా అచ్చం వీధిరౌడీల్లా ప్రవర్తించాలని కాదు. తాము ఎన్నికైన డివిజన్లలో ఎక్కడ భవన నిర్మాణాలు జరుగుతున్నా అక్కడికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కార్పొరేటర్లు ఇప్పుడు అంతకన్నా హీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బీభత్సం సృష్టించడం ప్రారంభించారు. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో పూలకుండీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేసిన ఆ కార్పొరేటర్లు తాజాగా జలమండలి కార్యాలయాన్ని వేదికగా చేసుకున్నారు.
తమ కంపు రాజకీయాన్ని పారించారు. గ్రేటర్లో డ్రైనేజీ సమస్య ఉందంటూ బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నాకు దిగి కార్యాలయం ముందు భయానక వాతావరణాన్ని సృష్టించారు. అప్పటికే కొందరు ఉద్యోగులంతా తమ తమ విధులకు చేరుకుంటున్న సమయం.. మరో పక్క వివిధ సేవల కోసం వచ్చే సందర్శకులు.. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణకు వెళ్లి తిరిగి ఆఫీస్కు వచ్చే ఉద్యోగులు, అధికారులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఒక్కసారిగా కార్యాలయం లోనికి దూసుకువచ్చారు. వస్తూ వస్తూ వారి వెంట సిల్ట్ (సీవరేజీ పూడికతీత మట్టి)ని తీసుకువచ్చి కార్యాలయంలో ఇష్టారీతిలో చల్లారు.. పోలీసులు వద్దని వారించినా రెచ్చిపోయి మొదటి అంతస్తులో ఎండీ చాంబర్ ముందు వేశారు.
కుండీలను ధ్వంసం చేశారు.. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ కార్పొరేటర్లను బయటకు పంపించారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకుగానూ జలమండలి అధికారులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బీజేపీ కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. సైఫాబాద్ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జలమండలి కార్యాలయంలో దౌర్జన్యానికి పాల్పడిన కార్పొరేటర్లు రవిచారి (రామ్నగర్), రచన (కవాడిగూడ), దర్శన్ (జియాగూడ), నర్సింహా రెడ్డి (మన్సూరాబాద్), జీవన్ రెడ్డి (హయత్నగర్), లచ్చిరెడ్డి (బీఎన్రెడ్డి నగర్), సుప్రియా గౌడ్ (ముషీరాబాద్) తదితర కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.