Musi River | సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): మూసీ నది పరిరక్షణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహాంతో ముందుకెళ్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది సుందరీకరణ చేపట్టాలన్న లక్ష్యంగా ఏర్పాటైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టింది. నగరానికి పడమర దిక్కున ఉన్న జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్సాగర్ల కింద నుంచి ప్రారంభమయ్యే మూసీ తీర ప్రాంతాన్ని గ్రామ నక్ష ఆధారంగా డిజిటల్ సర్వేను ఎంఆర్డీసీఎల్ అధికారులు నిర్వహిస్తున్నారు. మూసీ నది సరిహద్దు, దాని పరిసర ప్రాంతాలపై సమగ్రమైన సర్వేను నిర్వహిస్తూ గరిష్ఠ వరద స్థాయిని ఖరారు చేస్తున్నారు.
మూసీ తీరం వెంబడి 50 మీటర్ల కారిడార్ను బఫర్జోన్గా గుర్తించి, ఆ ప్రాంతంలో భవిష్యత్తులో దాన్ని యుటిలిటీ కారిడార్గా మార్చనున్నారు. ఇందుకోసం మూసీ తీరం వెంబడి అవసరమైన చోట భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకోసం అవసరమైన భూముల మ్యాపింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే హిమాయత్సాగర్ కింద నుంచి పారే ఈసీ నది వెంట వెలసిన ఆరు అక్రమ నిర్మాణాలను శనివారం మూసీ నది ప్రక్షాళన విభాగానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ మాలతి, అదనపు పోలీస్ కమిషనర్ లక్ష్మీనారాయణ, రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు, జీహెచ్ంఎసీ అధికారులు కలిసి కూల్చివేశారు.