హైదరాబాద్ : చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల (Independence Day) ఏర్పాట్లను డీజీపీ అంజనీకుమార్( DGP Anjani Kumar ) శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 15న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరుగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
వేడుకలకు హాజరయ్యే వారు సభాప్రాంగణంలో ఎంత దూరంలో ఉన్నా కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడీ(LED) లను ఏర్పాటు చేశామని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి వివరించారు. కార్యక్రమ లైవ్ కవరేజ్ కోసం 10 కెమెరా యూనిట్ లను, లైవ్ కవరేజ్ లింకింగ్ కు అవసరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. సభాప్రాంగణంలో సర్వం సిద్ధం సభకు వచ్చిన ముఖ్య అతిథులు, అధికారులు, సందర్శకులు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు డీజీపీకి వివరించారు.
హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో లక్ష వాటర్ ప్యాకెట్లు ( Water Packets) , 25 వేల వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేశామని జలమండలి ఎం.డీ దాన కిషోర్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో 4 అంబులెన్సులు (Ambulance), గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒగ గదిని సిద్దంగా ఉంచామని వైధ్యశాఖ అధికారులు తెలిపారు. మూడు ఫైర్ ఇంజిన్లు ( Fire Engines), ఆరు బెస్ట్ బైక్స్, నాలుగు ల్యాడర్లు ఏర్పాటు చేయనున్నామని ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ప్రత్యేక జనరేటర్లు, వర్షం పడినా ఇబ్బందులు లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్ లను ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు పేర్కొన్నారు.
1200 మంది కళాకారులతో ..
ముఖ్యమంత్రి కి దాదాపు 1200 మంది కళాకారులు స్వాగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ వివరించారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాలలో పార్కింగ్ వివరాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు,ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మీడియా వాహనాలకు సందర్శకులకు వేరు వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించామన్నారు.
జీహెచ్ ఎంసీ ఆధ్యర్యంలో శానిటేషన్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, టీఎస్ఐఐసీ ఎండి నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.