ప్రగతి పథంలో నియోజకవర్గం
ఏడేండ్లలో ఎంతో అభివృద్ధి
మణికొండ, ఏప్రిల్ 26 : మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంది. ప్రజలకు అవసరమైనంతగా తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, ప్రజా రవాణా వ్యవస్థ, పేదలకు అందుబాటులో గృహ వసతి, వారసత్వ పరిరక్షణ, పౌరుల భాగస్వామ్యం ద్వారా సుపరిపాలన, భద్రత, రక్షణ లాంటి ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పరిపాలన సాగిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5వేల కోట్ల నిధులతో గోదావరి మొదటి దశ, కృష్ణా మూడోదశ తాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం పూర్తిచేసింది. వీటి ద్వారా 30లక్షల మందికి తాగునీటిని అందజేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కింది.
శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాలల్లో అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపుతోంది. రోజురోజుకీ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో అన్ని డివిజన్లలో రాజకీయాకతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధే ఎజెండాగా ఏడున్నరేళ్లకాలంగా కొనసాగుతూనే ఉంది.
రద్దీలేని రహదారులు..
రహదారులు ట్రాఫిక్ చిక్కులు లేకుండా అద్బుతంగా తీర్చిదిద్దారు. ఎస్ఆర్డీపీ ద్వారా 20 ప్రదేశాలలో ఫ్లైఓర్లు స్కైవాక్స్, గ్రేడ్ సేవరేటర్లు, రహదారుల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 5స్కైవేలు,11 ప్రధాన కారిడార్లను ప్రభుత్వం నిర్మించింది. అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధి చుట్టూ ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, ఔటర్ రింగ్రోడ్డును నిర్మించారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మూసీ నదిపై తూర్పు నుంచి పడమర దిశగా 42 కి.మీటర్లల్లో ఆరు లేన్ల రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రధాన రోడ్లను వైట్ ట్యాపింగ్ రోడ్లుగా మార్చడానికి చర్యలను సర్కారు చేపట్టింది.