చంపాపేట, సెప్టెంబర్ 12 : చంపాపేట డివిజన్ పరిధిలో నిధుల లేమితో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గతంలో చేపట్టిన రోడ్లు, యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులు నిధుల లేమితో నిలిచి పోవటం మూలంగా కాలనీల ప్రజలు తీవ్ర సమస్యలకు గురి కావాల్సి వస్తుందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమా రెడ్డి న్యూ మారుతి నగర్ కాలనీ వాసులతో వెళ్లి ఎమ్మెల్యేకు వివరించారు.
ఇందుకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డివిజన్ వార్డు కార్యాలయం ఎదురుగా ఉన్న రెడ్డి బస్తీ, మహాంకాళమ్మతోట, రామ చిలుకలబస్తీ, అట్లాగే అంబేద్కర్ విగ్రహం వరకు రూ.50లక్షల 50వేల తో యూజీడీ పైప్లైన్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఇదే విధంగా కర్మన్ఘాట్ క్రాస్రోడ్డు (విష్ణు కాంప్లెక్స్) నుంచి తెలంగాణ ఫార్మసీ వరకు నూతన యూజీడీ ట్రంకులైన్ నిర్మాణ పనులు రూ.70లక్షలతో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
లోటస్ ల్యాఫ్ స్కూల్ ముందు నుంచి మొదలుకుని న్యూ మారుతి నగర్ రోడ్డు నెంబర్ 1 మీధుగా పోచమ్మగడ్డ, మారుతి నగర్ చర్చి, సాయిరాం నగర్ కాలనీ, ప్రగతి నగర్ వరకు యూజీడీ పైప్లైన్ నిర్మాణాల కొరకు రూ.51లక్షలు సాంక్షన్ అయినట్లు వారు వివరించారు.
ఇందులో బాగంగానే చంపాపేట మానస గార్డెన్ నుంచి డీ మార్ట్ వరకు నూతనంగా యూజీడీ పైప్లైన్ నిర్మాణాలు చేపట్టేందుకు రూ. 31లక్షలు ప్రభుత్వం సాంక్షన్ చేసినట్లు తెలియజేశారు. పనులను దశల వారీగా చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం కాలనీల వాసులు ఎమ్మెల్యే ను శాలువతో సన్మానం చేశారు.