కేపీహెచ్బీ కాలనీ, జనవరి 8 : కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో రెండున్నర ఎకరాల ఖాళీ స్థలాన్ని పార్కు, క్రీడా ప్రాంగణంగా, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లోని కార్పొరేటర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో రాష్ట్ర హౌసింగ్బోర్డు ఆధీనంలో ఉన్న రెండున్నర ఎకరాల ఖాళీ స్థలాన్ని.. ప్రజా ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీకి కేటాయించినందుకు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఖాళీ స్థలాలు పార్కులు, క్రీడా ప్రాంగణాలు..
కేపీహెచ్బీ కాలనీలో ప్రజా అవసరాల కోసం వదిలిన పదిశాతం నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నదన్నారు. కేపీహెచ్బీ కాలనీ మలేషియన్ టౌన్షిప్ వద్ద ఐదెకరాలలో క్రికెట్ స్టేడియంతో పాటు కేబీఆర్ పార్కు తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని రమ్యాగ్రౌండ్లో ఎన్టీఆర్ పేరుతో జడ్పీహెచ్ఎస్ పాఠశాలను నిర్మించేందుకు కృషి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వసంతనగర్ కాలనీలో, కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్, కాలనీ 1, 2వ ఫేజ్లలో ఖాళీ స్థలాలన్నింటినీ ఆహ్లాదకరమైన పార్కులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అలాగే మోడల్ రైతుబజార్, ఫిష్ మార్కెట్, మహిళలు.. చిన్నారులకు పార్కులు, ఇండోర్ స్టేడియంలు, స్విమ్మింగ్ఫూల్ పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. కాలనీలలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానవాటికలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. తాజాగా ప్రభుత్వం కేటాయించిన 9వ ఫేజ్లోని రెండున్నర ఎకరాల స్థలాన్ని కాలనీ ప్రజలు కోరిన విధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
చెరువుల పరిరక్షణకు..
కూకట్పల్లిలోని 9 చెరువులను పరిరక్షిస్తూ.. ఆహ్లాదకరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెరువులను కబ్జానుంచి కాపాడేందుకు సర్వేకు ఆదేశించినట్లు తెలిపారు. కూకట్పల్లి రంగధాముని ఐడీఎల్ చెరువును ట్యాంక్బండ్ తరహాలో తీర్చిదిద్దడం జరుగుతుందని.. ఈ చెరువుగట్టుపై వినాయకుడు, బతుకమ్మ, దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠాపన చేస్తామని.. ఇప్పటికే చేపట్టిన సుందరీకరణ పనులను 18 నెలల్లో పూర్తి చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా చెరువులలో మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీలను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, డివిజన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు అడుసుమల్లి వెంకటేశ్వర్రావు ఉన్నారు.