హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, నయాపూల్లోని మహంకాళి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి వివరించారు.
జులై 24 వ తేదీన జరగనున్న ఓల్డ్ సిటీ బోనాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై త్వరలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు రాకేష్ తివారి, క్రాంతి కుమార్, మామిడి కృష్ణ, మధుసూదన్ గౌడ్, గాజుల అంజయ్య, మాణిక్ ప్రభు, సంజయ్ తదితరులు ఉన్నారు.