మాదాపూర్, అక్టోబర్ 29: మాదాపూర్ డివిజన్లోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ ఆదివారం కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళ నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మరింత బాధ్యతతో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు రూ. 9 వేల కోట్లతో అభివృద్ధి చేశామని, అందరి ఆశీస్సులు, సహకారంతో వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనకు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. మహిళలు, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి ఇతర రాష్ట్ర నేతలు సైతం తమ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారన్నారు. శేరిలింగంపల్లిలో ఫ్లైఓవర్లు, అండర్బ్రిడ్జిలు, కొత్త రోడ్లు వేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగురవేస్తాం..
వచ్చే ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీకేనని మాదాపూర్లోని పలు కాలనీ వాసులు పేర్కొన్నారు. గాంధీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఆకర్శితులవుతున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
అభివృద్ధికి చిరునామా శేరిలింగంపల్లి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి : అభివృద్ధికి చిరునామాగా శేరిలింగంపల్లిని తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. నలగండ్ల లక్ష్మీవిహార్ ఫేజ్-1 కాలనీ, నానక్రాంగూడ ట్రెండ్సెట్ టవర్స్ గెటెడ్ కమ్యూనిటీ కాలనీల్లో ఆదివారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పర్యటించారు. కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. మరోసారి గెలిపిస్తే శేరిలింగంపల్లిలో మరింత అభివృద్ధి చేసి చూపెడతానని గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గణేశ్ ముదిరాజ్, చెన్నంరాజు ముదిరాజ్, ఎం. సత్యనారాయణ, దాసరి గోపి, ప్రసాద్, మల్లేశ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.