SNDP | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)/చార్మినార్ : రోడ్డు అభివృద్ధి ప్రణాళిక తరహాలోనే హైదరాబాద్ నగరంలో వరద నీరు సజావుగా సాగిపోయేలా అభివృద్ధి, నిర్వహణ విస్తరణను నిర్ధారించడానికి నాలాల అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక అవసరమని కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు. బుధవారం ఉదయం యాకత్పురాలోని పలు స్టార్మ్ వాటర్ డ్రెయిన్లను స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కార్పొరేటర్లతో కలిసి కమిషనర్ ఇలంబర్తి పరిశీలించారు. యాకుత్ పురా మురికి నాలాపై సమ్రగ సర్వే చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. పాత నగరంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్ఎన్డీపీతో నాలా పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రేటర్లో రూ. 545 కోట్ల వ్యయంతో ఎస్ఎన్డీపీ రెండో దశ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పాత నగరంలో చేపట్టిన పనులు వచ్చే వర్షాకాలం వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పలు ప్రాంతాల్లో పర్యటన
పాతనగర పర్యటనలో భాగంగా కమిషనర్ పలు ప్రాంతాలైన రంగేలి కిడికి, హుస్సేన్ కోటి, మౌలానా చిల్ల, గంగా నగర్, రెయిన్ బజార్లలో పర్యటించారు. ముందుగా రంగేలి కిడికి వీధిలో మురుగు నీరు ఓవర్ ఫ్లోను పరిశీలించారు. జహంగీర్ నగర్ నుండి గంగా నగర్ మురికి కాలువ నిజాం కాలంలో చేపట్టిన నాలా అయినందున గత వర్ష కాలంలో వరదకు పొంగిపోయిన నేపథ్యంలో మురికి నీరు వస్తున్నాయని మెయింటెనెన్స్ ఈఈ కమిషనర్కు వివరించడంతో మురుగు నీటి నాలా పై సమ్రగ సర్వే చేయాలని, నిజాం కాలం నాటి మురికి కాలువ అయినందున నాలాల పరిస్థితి తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. మురుగు నాలా సమ్రగ సర్వే చేసి పూర్తి నివేదిక అందజేయాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మౌలానా చిల్ల వద్ద గంగా నగర్ నాలాను పరిశీలించారు. రెయిన్ బజార్ పాత బాక్స్డ్రెయిన్ లో వర్షపు నీరు వెళ్లక వరద నీటి నిలిచిపోవడంతో ఇళ్లకు నీరు వస్తుందని కాలనీ వాసులు కమిషనర్కు చెప్పారు. దీంతో బాక్స్ డ్రెయిన్ పనులు చేపట్టేందుకు రూ.1.60 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే కమిషనర్ను కోరగా పని యొక్క సమగ్ర నివేదికను పంపించాలని ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు.