కేపీహెచ్బీ కాలనీ, జనవరి 22: కేపీహెచ్బీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఆదర్శవంతగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీలో రూ.1.25 కోట్లతో మహాత్మాగాంధీ పార్కులో అభివృద్ధి పనులు, బుద్ధా వర్టెక్స్ వద్ద సీసీరోడ్డు పునరుద్ధరణ, శిల్పా ఎవెన్యూలో నందనవనం పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేపీహెచ్బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చేలా ఓపెన్ జిమ్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, ఎనిమిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కేపీహెచ్బీ కాలనీలో వేలాది కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. కాలనీలలో ఎక్కడైనా ప్రజాసమస్యలుం టే నేరుగా తన దృష్టికి తీసుకరావాలని వెంటనే నిధులు మంజూరు చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, సాయిబాబా చౌదరీ, శ్యామలరాజు, ఆయా కాలనీల అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీల నేతలున్నారు.