హైదరాబాద్ : సికింద్రాబాద్లోని చరిత్రాత్మకమైన చిలుకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునిత, కంది శైలజ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీకృష్ణ, ఆలయ కార్య నిర్వహణాధికారి మహేందర్గౌడ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జలమండలి అధికారులు ఏర్పాటు చేసిన వాటర్ క్యాంప్ను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. రాష్ట్ర వైద్య శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.