ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 17: వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన ప్రచారంలో భాగంగా బౌద్ధనగర్ డివిజన్లో విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అంబర్నగర్ కట్ట నుంచి ప్రారంభమైన ఈ యాత్ర అశోక్నగర్, సంజీవపురం ప్రాంతాల గుండా సాగింది. మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్న ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికి, తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ సికింద్రాబాద్లో ప్రజారంజకమైన పరిపాలనను అందించిన తాము రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు జరిపామని చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి, మరిచిపోయే రోజుల్లో తాము ఏ హామీలు ఇవ్వకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు.
బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో వివిధ సమస్యలను పరిష్కరించామని, నిరంతరం తమతో పాటు తమ యంత్రాగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో రూపొందించిన కరపత్రాలను ఆయన ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. లష్కర్ గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం తథ్యమని స్పష్టం చేశారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, రాసురి సునీత, లింగాని ప్రసన్నలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు కిశోర్కుమార్, కిరణ్కుమార్, రామేశ్వర్గౌడ్, త్రినేత్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.