సికింద్రాబాద్, డిసెంబర్ 11: రాష్ట్ర సర్కారు పేద క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు సుమారు 14వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. ఈస్ట్ఫెస్ట్ నిర్వహణ కోసం సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు రూ.4 లక్షలు మంజూరు చేసింది. సర్వమతాలకు సమప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్ అన్నివర్గాల పండుగలకు చేయూతనిస్తున్నారు. ఈ నెల 17 నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రెండు నియోజకవర్గాలకు 14వేల గిఫ్ట్ ప్యాక్లు….!
సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు సుమారు 14వేల క్రిస్మస్ గిఫ్టులు ఆయా నియోజకవర్గాలకు చేరినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకులను అందించనున్నారు.
దీంట్లో భాగంగానే నేడు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి నామాలగుండులో ఉన్న చర్చిలో క్రైస్తవులకు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కానుకలను అందజేయనున్నారు. ఈ ప్యాకెట్లో ఒక చీర, పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్టు ఉన్నా యి. ఈ గిఫ్టులను ఆ యా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
క్రిస్మస్ కానుకల పంపిణీకి ఏర్పాట్లు
త్వరలోనే రాష్ట్ర సర్కారు క్రైస్తవులకు అందజేస్తున్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తాం. కంటోన్మెంట్లో సుమారు 4వేల గిఫ్ట్ ప్యాక్లు నియోజకవర్గానికి చేరనున్నాయి. కానుకల పంపిణీలను ఆయా వార్డుల్లోని చర్చిల వద్ద చేపట్టనున్నాం. అనంతరం చర్చిల్లోనే క్రిస్టియన్లకు ఈస్ట్ఫెస్ట్ విందు ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గంలోని ఆయా వార్డుల్లో పంపిణీ, ఈస్ట్ ఫెస్ట్ నిర్వహణ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తాం.
– జి. సాయన్న , కంటోన్మెంట్ ఎమ్మెల్యే