ప్రగతి భవన్లో కలిసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
సికింద్రాబాద్, జూలై 13 : ఈ నెల 17వ తేదీన జరుగనున్న లష్కర్ బోనాలతో పాటు తన నివాసం వద్ద ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం కేసీఆర్కు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలు అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రధానంగా సీతాఫల్మండి డివిజన్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. 2015 నుంచి స్కూల్ ప్రాంగణంలోనే జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయని చెప్పారు. హైస్కూల్ భవనాలకు రూ.14.45 కోట్లు, జూనియర్ కాలేజి భవనాలకు రూ.6.30 కోట్లు, డిగ్రీ కాలేజి భవనానికి రూ.9కోట్ల ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, లింగాని ప్రసన్నలక్ష్మి, కంది శైలజతో పాటు టీఆర్ఎస్ నేతలు తీగుళ్ల కిశోర్ గౌడ్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, తదితరులు ఉన్నారు.