సికింద్రాబాద్ / బేగంపేట, జనవరి 8: సమస్యల పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె జోనల్ కమిషనర్ రవికిరణ్,డీసీ సుధాంష్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించడానికి దోహదం చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం ఇక నుంచి ప్రతి సోమవారం ఉంటుందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి సికింద్రాబాద్ మున్సిపల్ జోనల్ కార్యాలయంలో స్పందన కరువైంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ డివిజన్ల నుంచి కేవలం మూడే దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. మొదటగా జనన ధృవీకరణ పత్రం కావాలని స్థానికుడు సతీష్ దరఖాస్తు చేసుకోగా అప్పటికప్పుడే ఆ సమస్యను పరిష్కరించామన్నారు. అలాగే, రాంగోపాల్పేటకు చెందిన శ్రీనివాస్ అక్రమ నిర్మాణంపై అధికారులు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరికి చెందిన మరొకరు భారతి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేశారు. ఆయా దరఖాస్తులపై విచారణ చేపడుతామని జోనల్ కమిషనర్ రవికిరణ్ తెలిపారు.
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అధికారులు తెలిపారు.
ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం బేగంపేట్ సర్కిల్ కార్యాలయంలో ప్రారంభించారు. బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య ఆధ్వర్యంలో మారేడ్పల్లిలోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాయలంలోని మూడో అంతస్తులో ఉన్న బేగంపేట్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎలాంటి దరఖాస్తులు రాలేదని సర్కిల్ ఉప కమిషనర్ తెలిపారు. అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.