సిటీబ్యూరో, జనవరి 18(నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ కొరడా ఝళిపిస్తున్నది. స్పెషల్ డ్రైవ్ను చేపట్టి కూల్చివేతలను మొదలు పెట్టింది. సోమవారం నుంచి ప్రారంభమైన కూల్చివేతల ప్రక్రియ ఇప్పటి వరకు గుర్తించిన అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసే వరకు కొనసాగుతుందని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం నాలుగు జోన్లు శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ ఉన్నాయి. జోన్ల వారీగా 600 గజాల పైబడి ఉన్న స్థలాల్లో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు జోన్ల పరిధిలో 203 అక్రమ నిర్మాణాలను గుర్తించి, ప్రతి రోజు 10 -20 అక్రమ నిర్మాణాలను ప్లానింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణలో కూల్చివేస్తున్నారు.
మరిన్ని గుర్తింపు…
ప్రస్తుతం 600 గజాల పైబడి ఉన్న స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను వారం రోజులో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అంతకంటే తక్కువ విస్తీర్ణంలో 70 గజాల నుంచి 600 గజాల లోపు ఉన్న ప్లాట్లలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను ప్రత్యేక బృందాలతో గుర్తించనున్నారు. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న శివారు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అక్రమ నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఈ కారణంగానే వేలల్లోనే అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు హెచ్ఎండీఏ ప్రాథమికంగా గుర్తించింది. జోన్ల వారీగా ఈ లెక్కలను తీసి, వాటిని సైతం కూల్చివేసే చర్యలకు ఉపక్రమించనున్నారు.
రెండో రోజు 13 నిర్మాణాలు…
మొదటి రోజు నాలుగు జోన్ల పరిధిలో 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, రెండో రోజైన మంగళవారం 13 నిర్మాణాలను కూల్చివేశారు. శంకర్పల్లి, బడంగ్పేట, దుండిగల్, బోడుప్పల్, పోచారం మునిసిపాలిటీల్లో కూల్చివేతలు కొనసాగాయని అధికారులు తెలిపారు. మంగళవారం శంకర్పల్లి మునిసిపాలిటీ పరిధిలో 4, దుండిగల్లో 3, బడంగ్పేటలో 3, పోచారంలో 2, బోడుప్పల్ మునిసిపాలిటీలో 1 చొప్పున అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కాగా, అక్రమ నిర్మాణాల విషయంలో సంబంధిత మునిసిపాలిటీలలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం ముందే ఎందుకు గుర్తించ లేదని, ఈ అంశంపై వారి నుంచి వివరణ కోరనున్నారు. ఇందుకు గాను ఆయా టౌన్ప్లానింగ్ విభాగాలకు తాఖీదులు ఇవ్వనున్నారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్ఎండీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.