ఖైరతాబాద్, మార్చి 12 : అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలేదు. అప్పుడే పేద, మధ్యతరగతి ప్రజలను కట్టుబట్టలతో రోడ్డున పడేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 175 ఇండ్లను కూల్చివేశారు. దీంతో ఆ కుటుంబాలన్నీ పిల్లా పాపలతో రోడ్డున పడ్డాయి. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడిపల్లి మండలం, పర్వతాపూర్లోని సాయిప్రియనగర్ కాలనీలో జరిగింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సాయిప్రియనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ముఖ్య సలహాదారులు నారగోని ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు సీహెచ్ మహేందర్, బాధితులు లక్ష్మి, ఉజ్వలత తమ గోడును వెల్లబోసుకున్నారు. సాయిప్రియనగర్కాలనీలోని సర్వే నంబరు 10, 11లో సుమారు 16 ఎకరాల్లో 1994 నుంచి 2002 సంవత్సరాల మధ్య పైసా పైసా కూడబెట్టుకొని నెలకు రూ.500 చొప్పున వాయిదాలు చెల్లించి ఒక్కొక్కరు 133 నుంచి 200 గజాల లోపు స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన వారిలో సుమారు 350 మంది పేద, మధ్యతరగతి ప్రజలు కూలీలే ఉన్నారన్నారు. అందులో కాలక్రమేనా ఇండ్లు నిర్మించుకున్నామన్నారు. ప్రస్తుతం ఆ ఇండ్లకు జియో ట్యాగ్ చేయడంతో పాటు ఇంటి నంబర్లు సైతం కేటాయించారని, కరెంటు బిల్లులు, ఇతర పన్నులు కడుతున్నామన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వయంగా మంత్రి కేటీఆర్ జీవో నం.118 తీసుకువచ్చి, తద్వారా నామమాత్రంగా రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారన్నారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయని, ఆ సమయానికి కేవలం ఒక్క ఇళ్లు మాత్రమే క్రమబద్ధీకరణ జరిగిందన్నారు. ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఇండ్ల రెగ్యూలరైజేషన్ కోసం ప్రజావాణి, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నామని, స్వయంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించామని, అయినా తమపై కనికరం చూపలేదన్నారు.
ఇదిలా ఉండగా, మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ తమపై కక్ష గట్టారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్థానిక నాయకులకే ఫుల్పవర్ ఇవ్వడంతో ప్రభుత్వ భూమి పేరిట తమ ఇండ్లను బలవంతంగా కూల్చివేయించారని వాపోయారు. కూల్చివేసే ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే స్యయంగా ఇండ్లను క్రమబద్ధీకరిస్తానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటుపై కూర్చోగానే తమను విస్మరించారని, పైగా కాంగ్రెస్ నాయకులే దుశ్చర్యకు పాల్పడతుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు.. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ తమకు నీడనైనా కల్పించండి.. లేని పక్షంలో స్వయంగా ఉరివేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.