Khajoor | రంజాన్ మాసం ఆరంభమైందంటే చాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఖర్జూరం( Khajoor ) పండ్ల బండ్లు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే రంజాన్( Ramzan ) ఉపవాస దీక్షలను విరమించే ముందు.. తప్పనిసరిగా ఖర్జూరం పండు మాత్రమే తింటారు. ఈ పండు తినడంతో శరీరానికి అవసరమైన పోషకాలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. దీంతో ఖర్జూరం పండ్లకు రంజాన్ మాసమంతా భలే డిమాండ్ ఉంటోంది. అయితే ఈ ఏడాది ఖర్జూరం మరి ఖరీదు అయిపోయింది.
ఖర్జురా పండ్లను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇరాన్, ఇరాక్, ట్యునీషియా, సౌదీ అరేబియా, దుబాయ్, అల్జీరియా, పాలస్తీనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఖర్జురాలతో పాటు హైదరాబాద్ నగరంలో మెడ్జూల్, అజ్వా, అంబర్, సుగై, మాబ్రూమ్, సుక్కరి, రబియా, కల్మీ, అస్వాది, సఫావి వంటి ఖర్జురా పండ్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో మెడ్జూల్ ఖర్జురాలు( Medjool dates ) అత్యంత ఖరీదైనవి. ఎందుకంటే ఇవి మంచి రుచిని కలిగి ఉంటాయి కాబట్టి. రంజాన్ మాసానికి ముందుకు మెడ్జూల్ ఖర్జురాలను కిలో రూ. 1400కు విక్రయించారు. ఇప్పుడు హోల్ సేల్ మార్కెట్లో ఆ పండ్ల ధర కిలో రూ. 1600 నుంచి రూ. 1800 వరకు పెరిగిందని మొఘల్పురాలోని ఏఎం డేట్స్ హౌస్ యజమాని ఆదిల్ అహ్మద్ వెల్లడించారు.
సాధారణ ఖర్జురాలు అయితే కిలో రూ. 80 నుంచి రూ. 120 మధ్య లభ్యమవుతున్నాయి. దిగుమతి చేసుకుంటున్న సుక్కరి, అజ్వా, అంబర్ వంటి ఖర్జురాలు కూడా సరసమైన ధరలకే లభిస్తున్నాయి. కిమియా( Kimia ) బ్రాండ్ డేట్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 500 గ్రాముల బాక్స్ను రూ. 160 నుంచి రూ. 170 మధ్య విక్రయిస్తున్నారు. ఎండు ఖర్జురాలను కిలో రూ. 400కు విక్రయిస్తున్నారు.