సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): రెండేండ్ల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టని సర్కార్.. ప్రతిపాదించిన ప్రాజెక్టులను కూడా పరిపూర్ణం చేయడంలో నేలచూపులే చూస్తున్నది. హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి 100 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని చెప్పి.. తీరా గడువు ముగియడంతో మరో నెల పొడిగించింది. నిధుల సర్దుబాటు చేసుకోలేక, స్పష్టమైన రూట్ మ్యాప్ లేక మెట్రో టేకోవర్ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది.
అట్టహాసంగా అసెంబ్లీలో తీర్మానాలు చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో నయా పైసా విధిల్చే పరిస్థితి లేకపోవడంతో… మెట్రో భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నది.
మెట్రోను సొంతం చేసుకోవాలంటే ముందుగా ఎల్ అండ్ టీకి సుమారు రూ. 13వేల కోట్ల అప్పును బదిలీ చేసుకోవడంతోపాటు, మరో రూ. 2వేల కోట్ల ఈక్విటీని చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా రూ. 15వేల కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడనున్నది. ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తారనే విషయాన్ని ఇప్పటికీ వరకు సర్కారు ప్రకటించలేదు. కేవలం అప్పుల కోసం జపాన్కు చెందిన ఆర్థిక సంస్థల వెంట పడుతూ కాలయాపన చేస్తున్నది.
తక్కువ వడ్డీ పేరిట సాగుతున్న కాలం..
తక్కువ వడ్డీకి రుణం వస్తుందన్న ఆశతో జపాన్ ఆర్థిక సంస్థల కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నది. కానీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలంటే ఎన్నో సంక్లిష్టమైన ప్రక్రియ ఉంటుందనే విషయాన్ని మరిచి.. తక్కువ వడ్డీ మాయలో పడి కాలం వెళ్లదీస్తున్నది. మార్చిలోపే పూర్తి చేస్తామని ప్రజలను ఎందుకు మభ్యపెడుతోందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల మెట్రో ఫేజ్-2 విస్తరణ కూడా మూలన పడే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ చేతుల్లోకి ఇంకెప్పుడూ?
ప్రస్తుతం కార్పొరేట్ స్థాయిలో నడుస్తున్న మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటే, అదీ ఆర్టీసీ లాగా నష్టాల ఊబిలోకి వెళ్తుందనే సందేహాలు ఉన్నాయి. అదే గనుక జరిగితే నిర్వహణ సామర్థ్యాన్ని మరింత కోల్పోయి, కనీసం అప్పులకు వడ్డీలు కట్టలేక మెట్రో వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కూడా మెట్రో వ్యవస్థను కుప్పకూల్చేలా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మార్చి 31లోపు స్వాధీనం పూర్తి చేస్తామని చెప్పిన సర్కార్.. రూ. 15వేల కోట్ల నిధుల సర్దుబాటుతోనే తర్జనభర్జనలు పడుతున్నది.