Hyderabad | బీఆర్ఎస్ పోరాటాల ఫలితం..ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రం దిగివచ్చింది. చీటికీమాటికీ ఇష్టానుసారంగా కంటోన్మెంట్ రహదారులను మూసివేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజారవాణాకు ఇబ్బందులను సృష్టిస్తున్న ఎల్ఎంఏ(లోకల్ మిలటరీ అథారిటీ)కు మూసివేసిన ఐదు రోడ్లను తక్షణమే తెరవాలంటూ రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహనాల రాకపోకలకు అనుగుణంగా రహదారులను తెరిచి ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
కంటోన్మెంట్, ఏప్రిల్ 21 : కంటోన్మెంట్ పరిధిలోని పలు రోడ్లను మూసివేసిన లోకల్ మిలటరీ అథారిటీ (ఎల్ఎంఏ)అధికారులకు రక్షణ శాఖ ఝలక్ ఇచ్చింది. చీటికి మాటికి ఇష్టానుసారంగా రోడ్లను మూసివేస్తూ ప్రజారవాణాకు ఇబ్బందులను సృష్టిస్తున్న ఎల్ఎంఏకు తాజాగా రక్షణ శాఖ మూసివేసిన ఐదు రోడ్లను తెరవాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రతిపాదిత రోడ్ల మూసివేతను విరమించుకోవాల్సిందిగా కంటోన్మెంట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ పరిధిలోని ఐదు రోడ్లపైకి ప్రజల వాహనాల రాకపోకలకు అనుగుణంగా తెరిచి ఉంచాలని సూచించింది. దేశ వ్యాప్తంగా 39 రోడ్ల మూసివేతకు సంబంధించి రక్షణ శాఖ ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. వివిధ కంటోన్మెంట్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ 12 రోడ్లను తక్షణమే తెరవాల్సిందిగా, మరో ఏడు రోడ్లకు సంబంధించి యధాతథ స్థితిని కొనసాగించాలని సూచించింది. వీటిలో ఐదు రోడ్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోనివే కావడం గమనార్హం. రక్షణ శాఖ ఆదేశాలతో కంటోన్మెంట్ పరిధిలోని ప్రొటీనీ రోడ్డు, బ్యామ్ రోడ్డు, రిచర్డ్సన్ రోడ్డు (లక్డావాలా రోడ్డు), అమ్ముగూడ రోడ్డు, ఆల్బెయిన్ రోడ్లను తెరిచి ఉంచనున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఆరు రోడ్లను మూసివేయనున్నట్లు బోర్డు అధికారులు ఆరు నెలల క్రితం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో అక్రమంగా మూసివేసి ఉన్న రోడ్లను మళ్లీ తాజాగా మూసేస్తున్నట్లు ప్రకటన ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే మర్రి నేతృత్వంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రక్షణ శాఖకు తమ అభ్యంతరాలు వెల్లడిస్తూ లేఖ రాసింది. కంటోన్మెంట్ బోర్డు తీర్మానం లేకుండా ఆయా రోడ్లను మూసివేయొద్దని కోరారు. ఈ మేరకు గతంలో రక్షణ శాఖ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో రోడ్ల మూసివేత అంశంపై వాడి వేడి చర్చ సాగింది. రోడ్ల మూసివేత విషయంలో రక్షణ శాఖ నియమించిన కమిటీ సూచనల మేరకే నిర్ణయం ఉంటుందని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత ఆరు రోడ్లలో ఎంప్రెస్ రోడ్డు మూసివేతకు మాత్రమే అనుమతించిన రక్షణ శాఖ, మిగతా రోడ్లను తెరవాల్సిందేని సూచించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఈ ఆరు రోడ్లనే కాదు.. తరచూ మూసివేసే రోడ్లను శాశ్వతంగా తెరవడంతో పాటు తిరుమలగిరిలోని డంపింగ్ యార్డును సైతం అక్కడి నుంచి తరలించాలని ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజలు బోర్డుకు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలిపారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోస్టుకార్డు ఉద్యమమే కొనసాగింది. లక్షలాది మంది ప్రజలు పోస్టుకార్డుల ద్వారా తమ అభీష్టాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం ఆ రోడ్లను తెరవాలంటూ లిఖితపూర్వకంగా డిమాండ్ చేశారు. ఇలా 21 రోజుల పాటు వెల్లువలా ఈ ఉద్యమం కొనసాగింది. సుమారు ఆరు నెలల తరువాత కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తుది ఆదేశాలు ఇస్తూ ఐదు రోడ్లను తెరవాలని సూచించింది.