సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రజలపై నీటిపన్ను వేస్తే సహించేది లేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత (MLA Lasyanandita) అన్నారు. సామాన్య ప్రజలపై భారం వేసే ఏ నిర్ణయాన్ని కూడా ఒప్పుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్, రెడ్డి, పాండు యాదవ్లతో కలిసి నీటిపన్నుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం బోర్డు కార్యాలయంలో సీఈఓ మధుకర్ నాయక్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు (Cantonment Board ) పరిధిలో నివసిస్తున్న ప్రజలపై నీటి పన్ను విధించాలన్న నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బోరు నీటికి మీటర్లు (Meters) పెట్టి పన్ను వసూలు చేయడం సరికాదన్నారు. బోర్డు పరిధిలోని ప్రజలకు ఎలాంటి పన్ను భారాలు పడకుండా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సాయి కిరణ్, కిరణ్, సతీశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.