Forensic Lab Fire Accdient | హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుంచే ఆపరేషన్ జరగుతుందని తెలిపారు. ఈ ల్యాబ్లోని ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.
ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మొదటి అంతస్తులో పొగ రావడం గమనించిన ఆఫీస్ బాయ్.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడని పేర్కొన్నారు. అప్పటికి ఇంకా ఆఫీసు పూర్తిగా ఓపెన్ కాకపోవడంతో కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారని.. వారంతా బయటకు వచ్చేశారని చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారని తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా లోపలికి వెళ్లడానికి కుదరడం లేదని.. ల్యాబ్లో ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం
నేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుంది
ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు
షార్ట్ సర్క్యూట్… https://t.co/4w0yY1tB17 pic.twitter.com/TrUmEPqY4Z
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026
నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు కేసు సహా పలు కీలక కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఎవిడెన్స్లు ఇక్కడే ఉండటంతో ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అంటున్నారు.