Danam Nagender | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఊసరవెల్లి.. ప్రాణ రక్షణ కోసం రంగులు మారుస్తుంటుంది. కానీ.. కొందరు నాయకులు అధికారం కోసం జెండాలు మారుస్తారు. ఊసరవెల్లి రంగులు మార్చేందుకైనా కొంత సమయం పడుతుందేమోగానీ! సదరు నాయకుడు ఓట్లేసిన జనం వేలికి సిరా గుర్తు చెరిగిపోకముందే కండువా మార్చేస్తాడు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వీరతాడు వేయొచ్చు. ఇప్పుడే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ హైదరాబాద్ రాజకీయ నాయకుడి తీరు రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సీను మరోసారి పునరావృతం చేస్తూ.. కేవలం మూడు నెలల కిందటే గులాబీ కండువాతో ఓట్లు అడుక్కున్న చోట మరో పార్టీ కండువాతో జనం మధ్యలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నవ్విపోదరుగాక.. నాకేటి సిగ్గు అన్నట్లు జంపింగ్ జపాంగ్లకే ఆదర్శంగా నిలిచారు. మరి.. నేతకు లేకున్నా! ఏండ్ల తరబడి పార్టీ జెండా మోస్తున్న నికార్సయిన కార్యకర్తలకు ఉంటుంది కదా.. అందుకే సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ ఎంపికపై నగర కాంగ్రెస్ కస్సుమంటుంది. ముఖ్యంగా సదరు దానం జంపింగ్ అనేది ఒంటరిగా ఉండదు కదా.. చుట్టూ ఉండే తన అనుచరులు కూడా వెంట ఉండటంతో తాము ప్రతిపక్షంలో ఉన్నంతకాలం అధికారాన్ని అనుభవించిన వాళ్లు ఇప్పుడు తమకు అవకాశాలు వచ్చే సమయంలో గద్దలా వచ్చి అవకాశాలను తన్నుకుపోతున్నారంటూ రగిలిపోతున్నారు.
రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజం. కానీ ఈ జంపింగ్లోనూ కొందరు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తారు కూడా. ఇందుకు నగర రాజకీయ నాయకుడు దానం నాగేందర్కు ఓ ప్రత్యేకత ఉందంటూ రాజకీయ పరిశీలకులు చురకలు అంటిస్తున్నారు. గులాబీ కండువా మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ రాత్రికి రాత్రే కండువా మార్చుకున్న సందర్భంగా అతడి జంపింగ్ టాలెంట్ చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే తరహా భారీ జంపింగ్ ఆయన ఖాతాలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. పీజేఆర్ అనుచరుడిగా నగర రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్ చివరకు ఆయన బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే పీజేఆర్ ప్రత్యర్థి అయిన వైఎస్ రాజశేఖర్రెడ్డి పంచన చేరి ఆయన్ని మానసిక క్షోభకు కారణమయ్యాడనేది సీనియర్ నేతల విశ్లేషణ. అంతేకాదు ఇప్పుడు పీజేఆర్ వారసుల అవకాశాలను కూడా కొల్లగొట్టడంలో ముందు వరుసలో ఉన్నారు. కాగా తొలిసారిగా ఉమ్మడి ఏపీలో 1994లో ఆసిఫ్నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఆపై 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 2004లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో తొలిసారిగా తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు. ఆసిఫ్నగర్ నుంచి ఆయన గెలవగా.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అరెరె.. టీడీపీ గెలుస్తుందనుకుంటే కాంగ్రెస్ గెలిచింది కదా! అనుకొని వెంటనే టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వెను వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డారు. కానీ దానం ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది. ఆ ఉప ఎన్నికలో దానంకు పరాభవం తప్పలేదు. దీంతో అధికార ఎమ్మెల్యేగా దర్పం ఒలకబోద్దామనుకున్న నాగేందర్కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనమైంది.
ఉమ్మడి రాష్ట్రంలోనే 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ గెలుస్తుందనే గంపెడాశతో పోటీ చేసి, నిరాశ ఎదురుకావడంతో ఏం చేయాలో దిక్కు తోచలేదు. దీంతో 2018 ఎన్నికల సమయానికి మరోసారి జంప్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) పార్టీలోకి వచ్చి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున ఈ ఐదేండ్లు కుదురుగానే ఉన్నారు. గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుంచి బరిలోకి దిగి మళ్లీ గెలిచారు. కానీ ఈసారి బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే.. దానం నాగేందర్ తనలోని జంపింగ్ టాలెంట్కు మళ్లీ పని కల్పించారు. పరస్పర ప్రయోజనం అనే ప్రాతిపదికన రాత్రికి రాత్రే గులాబీ కండువాను వీడగా.. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా దుర్భిణీ వేసినా ఎవరూ దొరకకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు కండువా కప్పి తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అభ్యర్థి లోటు తీరిందనేది కాంగ్రెస్ అనివార్యత.. ఓడిపోయినా ఎమ్మెల్యేగా అధికార పార్టీకి అంటకాగుతూ ఉండొచ్చనేది దానం అవకాశవాదం. అయితే ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున గెలిచి నెలల వ్యవధిలోనే ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున మళ్లీ పోటీ చేసి ఓడిపోయిన రికార్డు నెలకొల్పిన దానం నాగేందర్.. ఇప్పుడు అదే తరహాలో బీఆర్ఎస్ తరపున గెలిచి మూడు నెలల వ్యవధిలోనే సికింద్రాబాద్ లోక్సభ నుంచి అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ తన పాత రికార్డుకు సరికొత్త శోభను తెచ్చారు. మరి.. మూడు నెలల కిందటే గులాబీ కండువాతో ఓట్లు అడిగిన దానం ఇప్పుడు కాంగ్రెస్ కండువాతో మళ్లీ ఓట్లు అడుగుతుండటాన్ని ఓటర్లు ఎలా తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.