సిటీబ్యూరో, సెప్టెంబరు 2 (నమస్తే తెలంగాణ ) : తాగునీటి సరఫరాలో(Drinking water) నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్(Dana Kishore) జలమండలి అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం మాసబ్ ట్యాంక్లోని టీయూఎఫ్ఐడీసీ కార్యాలయంలో జలమండలి ఎండీ అశోక్రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఉన్నతాధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
సీవరేజ్, తాగునీరు సరఫరాలో ఎదురయ్యే సమస్యలను దూరం చేసేందుకు జీఎం, డీజీఎం, మేనేజర్లు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎండీ ఆదేశించారు. వర్షాలతో తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున నీటిని సేకరించాలని, వినియోగదారులకు సరఫరా చేసే వరకు నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని దానకిశోర్ తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో జలమండలి అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్హోల్స్ తెరవకుండా చూడాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆదేశించారు.