అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
బంజారాహిల్స్, మే 31: దళితుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండో విడుతలో భాగంగా 1000 మంది లబ్ధిదారులకు సాయం అందించనున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతలో భాగంగా 100 మంది లబ్ధ్దిదారుల ఎంపిక పూర్తయిందని, ఇప్పటికే వారి ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున పడ్డాయన్నారు. తొలివిడుతలో సుమారు 400మందికి దళితబంధు కోసం దరఖాస్తులు చేసుకున్నారని, తాజాగా ఇవ్వనున్న దళిత బంధు లో వీరందరికి అవకాశం ఉంటుందన్నారు. తొలివిడతలో రిజెక్ట్ అయినవారందరూ మరోసారి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఒక్కరికే అర్హత ఉంటుందని పేర్కొన్నారు.
రెండో విడతలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, డివిజన్ల పరిధిలో 200మంది చొప్పున, ఖైరతాబాద్, హిమాయత్నగర్, సోమాజిగూడ డివిజన్ల పరిధిలో 150మంది చొప్పున అవకాశం కల్పించనున్నామన్నారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గానీ, కార్పొరేటర్లకు గానీ ఇవ్వాలని సూచించారు.