వాహనాలు అందజేసిన విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
మాదాపూర్, జూన్ 16: దళిత బంధు పథకం అర్హులైన ప్రతి ఒకరికి పూర్తి స్థాయిలో అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులకు గురువారం మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయిబాబలతో పాటు స్థానిక పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు విప్ గాంధీ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుతో ఎంతో మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు.
దశల వారీగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు కానున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో 2 వేల మంది లబ్ధిదారులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం కానున్నట్లు పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపికలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మార్గదర్శకాలు, విధి విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని ఇది వరకే నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 16న ఎంపికైన లబ్ధిదారులకు మంజూరైన 22 వాహనాలు (ట్రాక్టర్లు 2, కార్లు 14, మహేంద్ర ట్రక్స్ 5, ఆటో 1)లను లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగాలలో మరింత ఉన్నతి సాధించాలని, వారి కుటుంబాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో లబ్ధిదారులు తలెత్తుకొని జీవించేలా ఆర్థిక పరిపుష్టి కలిగేలా ఈ పథకం తోడ్పడునున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు నచ్చిన యూనిట్లను నెలకొల్పి ఆర్థిక, సామాజిక సాధికారికతను పెంచే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఈడీ బాలాజీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఈడీ ప్రవీణ్, మాజీ కార్పొరేటర్లు రంగారావు, అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, వీరేశం గౌడ్, సంజీవరెడ్డి, రఘునాథ్రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
కొండాపూర్, జూన్ 16: సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేసుకోవచ్చని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎన్క్లేవ్ కాలనీలో గురువారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 3.60 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డి, డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్లతో పాటు చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోరెడ్డి, ఎస్సై శ్రీధర్లతో కలిసి విప్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిఘా నేత్రాలతోనే నేరాలు అదుపు చేయవచ్చని అన్నారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి ఒక కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని నేరాలను నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు నరేందర్, సందీప్, నరేందర్రెడ్డి, కాలనీ అధ్యక్షుడు మల్లారెడ్డి, సెక్రటరీ శ్రీశైలం, చౌదరి, హుస్సేన్, నిఖిల్రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.