రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం అమలులో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విజయవంతంగా అమలు పరిచారు. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజక వర్గాల్లో 1484 మందికి, మేడ్చల్ జిల్లాలో 563 మందికి దళితబంధు పథకాన్ని అమలు పరిచారు. ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.9.90 లక్షలు చొప్పున పంపిణీ చేశారు. మిగిలిన రూ.10 వేలు దళిత రక్షణ నిధికి మళ్లించారు. దళితబంధు పథకం ద్వారా కిరాణ షాపులు, డిజిటల్ షాపులు, పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లు, కార్లు, ట్రాక్టర్లు వంటి 40 రకాల వ్యాపారాలు ప్రారంభించారు. వ్యాపారులు క్రమ క్రమంగా పుంజుకుంటుండడంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నారు.
– సిటీబ్యూరో/ మేడ్చల్, జనవరి 21 (నమస్తే తెలంగాణ)
ప్రైవేటు ఉద్యోగిని.. వ్యాపారినయ్యా..
దళితబంధు పథకం మా కుటుంబంలో ఆనందం నింపింది. ప్రైవేట్ ఉద్యోగిగా ఉండేవాడిని.. దళితబంధు నిధులతో వ్యాపారిగా మారాను. టెంట్హౌజ్ను ఏర్పాటు చేసుకున్నా. వ్యాపారం బాగుంది. ప్రతి నెల ఖర్చులు పోను రూ. 25 వేలు వస్తున్నాయి.నా టెంట్ హౌజ్ ద్వారా మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. రానున్న రోజుల్లో టెంట్హౌజ్ను మరింతంగా విస్తరిస్తా.
– నర్సింగ్, ఎస్పీనగర్, మల్కాజిగిరి మరికొందరికి ఉపాధినిచ్చా..
నేను వ్యాపారం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. దళితబంధు పథకంతో వచ్చిన రూ. 10లక్షలతో బేకరీ పెట్టుకున్నా. ఇప్పుడిప్పుడే వ్యాపారం బాగా సాగుతుంది. ఖర్చులు పోను నెలకు రూ. 20 వేల పైచిలుకు సంపాందిస్తున్నా. ప్రతి నెల రూ. 50 వేలు సంపాందించేందుకు వ్యాపారాన్ని పెంచేలా చూస్తున్నాను. వ్యాపారం చేస్తూ మరికొంత మందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది.
-ఎరుపుల లక్ష్మి, వెంకటాపురం
నెలకు రూ.25 వేలు వస్తున్నాయ్..
మాది గోషామహల్ నియోజకవర్గం పరిధిలో మంగల్హాట్ ప్రాంతంలోని కుమ్మరివాడ. నేను సీసీ కెమెరాల బిగించేందుకు వెళ్లేవాడిని. అప్పుడు నెలకు రూ. 8వేలు వచ్చేవి. దళిత బంధు నిధులతో సీసీ కెమెరాల దుకాణం పెట్టుకున్నాను. ఇప్పుడు గిరాకీ బాగానే ఉంది. నెలకు రూ.25 వేల వరకు ఆదాయం వస్తున్నది. దళిత బంధుతో మా జీవితాల్లో వెలుగులు నిండాయి. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.
– బాగల్ల గిరి, సీసీ కెమెరాల దుకాణం యజమాని
రెండు చేతులా సంపాదిస్తున్నా..
మాది కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కార్ఖానా. 1982 నుంచి బాలానగర్లో రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషన్స్ మెకానిక్గా పని చేశా. ఏడాదిలో 6నెలలు జోరుగా పని ఉండేది. మరో ఆరు నెలలు ఈగలు కొట్టుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి. సీజన్లో ఎంత కష్టపడినా రూ.10వేలు రాకపోయేవి. అంతంత రాబడితో కుటుంబాన్ని నడపడం ఇబ్బందయ్యేది. దళిత బంధు పథకంలో ఎంపికయినవని ఎమ్మెల్యే సార్ చెప్పిండు. వచ్చిన పైసలతో అశోక్ లీలాండ్ (బడా దోస్త్) వాహనాన్ని కొన్నాను. కొన్ని రోజులు నేనే నడిపిన. ఇప్పుడు అమెజాన్ కంపెనీలో పెట్టాను. నెలకు రూ.25వేలు సంపాదిస్తున్నా. ఖాళీ సమయంలో మెకానిక్గా చేస్తున్నా. రెండు చేతులా సంపాదనతో ఇల్లు గడుస్తున్నది. పిల్లల చదువులకు ఇక డోకా లేదు. ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములే 20వేలు, 30వేలు బదలో, సదలో అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ సారు, ఎమ్మెల్యే సాయన్న మాకు ఆత్మ బంధువులుగా నిలిచిండ్రు. వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– నిత్యానంద్, కార్ఖానా
సంతోషంగా ఉన్నాం
దళితబంధు పథకం ద్వారా ట్రాక్టర్ కొన్నా. ప్రతి నెల రూ. 20 వేల పైచిలుకు ఆదాయం వస్తున్నది. ఓ డ్రైవర్, మరికొంత మంది కూలీలకు ఉపాధిని ఇస్తున్నా. కుటుంబ సభ్యులందరం సంతోషంగా ఉన్నాం. ట్రాక్టర్కు రుణం చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటున్నాం.
-శ్రీరాం మహేశ్వరి, మల్కాజిగిరి
ట్రావెల్స్ పెట్టుకుంటా..
దళితబంధు పథకం ద్వారా కారును తీసుకున్నా. కారు కిరాయికిస్తూ ప్రతి నెల రూ. 20 వేలు సంపాందిస్తున్నా. ఈ సంపాదనతో కుటుంబ సభ్యులందరం సంతోషంగా ఉన్నాం. ఇంట్లోనే ఉండే నేను కారుకు కొని వ్యాపారిగా మారా. ఇప్పుడు మరో కారు కొని ట్రావెల్స్ వ్యాపారం పెట్టుకుంటా.
-జి. చంద్రకళ, ఆనంద్బాగ్
పథకం విజయవంతమైంది
జిల్లాలో మొదటి విడత దళితబంధు పథకం విజయవంతమైంది. 563 మంది వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. ప్రస్తుతం రూ. 20 వేల పైచిలుకు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. వ్యాపారాలు చేసుకుంటున్న లబ్ధిదారులందరూ సంతోషంగా ఉన్నారు.
-బాలాజీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి
కూలీకి పోయేవాడిని.. కిరాణ దుకాణం పెట్టుకున్నా..
నేను నాంపల్లిలో ఉంటాను. ఇంతకు ముందు కూలీ పనులకు పోయేది. రోజంతా కష్టపడి పనిచేస్తే వచ్చే కూలీతో పొట్టనింపుకునేది. కొన్ని రోజులు పనులు దొరక్క ఇబ్బంది పడేది. ప్రభుత్వం ఇచ్చిన దళితబంధు పైసలతో సీబీఐ క్వార్టర్స్లో కిరాణ దుకాణం పెట్టుకున్నాను. ఇప్పుడు దుకాణంలోనే ఉంటున్నాను. కూర్చున్న చోటనే నెలకు రూ. 30 వేల వరకు ఆదాయం వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వి. మనోహర్రాజ్, కిరాణ దుకాణం యజమాని
మా బతుకులు మారాయి
మాది కార్వాన్ నియోజకవర్గం, లంగర్హౌజ్, హరిదాస్పుర. ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు పథకం ద్వారా పేపర్ ప్లేట్ల యూనిట్ పెట్టుకున్నాను. ఇన్నాళ్లూ ఒకరి దగ్గరకు పనికి వెళ్లే నేను.. ఇప్పుడు మరికొంత మందికి ఉపాధినిచ్చే స్థాయికి వచ్చాను. పేపర్ ప్లేట్ యూనిట్తో ప్రతి నెల రూ.35వేల వరకు ఆదాయం వస్తుంది. సీఎం కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా ప్రస్తుతం మా కుటుంబ జీవన విధానంలో మార్పు వచ్చింది.
– ఎన్ జ్యోతీబాయి, పేపర్ ప్లేట్ల కంపెనీ యజమాని