మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ.. రైతుబంధు.. వంటి తెలంగాణ పథకాలను ఇప్పటికే కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా గ్రౌండింగ్ అవుతున్న దళితబంధు పథకాన్ని నకల్ కొట్టింది!
కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖర్చు చేయకుండా ఉంచిన నిధులతో దళితబంధు తరహాలో ట్రాక్టర్లు, ఇతర వాణిజ్య వాహనాలను దళితులకు అందించేందుకు సిద్ధమవుతున్నది. కేంద్రానికి దళితుల పట్ల అకాల ప్రేమ పుట్టుకురావడానికి ఏడాది వ్యవధిలో ఏడు రాష్ర్టాల్లో జరగనున్న ఎన్నికలే కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఏడాదిలోగా ఏడురాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు రానున్నవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధును కాపీ కొడుతూ.. ఆ పథకం తరహాలో వారికి నిధులు ఖర్చుచేయాలని భావిస్తున్నది. కేంద్రం దళితుల సంక్షేమానికి కేటాయించిన రూ.950 కోట్లను వివిధ శాఖలు ఖర్చు చేయలేదు. దీంతో వాటిని సామాజిక న్యాయం, దళితుల సాధికారత నోడల్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఖర్చు చేయని నిధులను మరో శాఖకు ఆర్థికశాఖ బదిలీ చేయడం ఇదే తొలిసారి కావటం ఒక విశేషమైతే.. ఈ నిధులను దళితబంధు తరహాలో దళితుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆదాయ ఉత్పత్తి పథకాలకు ఖర్చు చేయాల్సిందిగా ఆదేశించడం కొసమెరుపు. నిధులిచ్చినా ఖర్చుపెట్టని శాఖలు ఎస్సీల సంక్షేమానికి 41 కేంద్ర మంత్రి త్వశాఖలు బడ్జెట్లో ఏటా 2.20 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అనేక శాఖలు నిధులను ఖర్చు చేయకపోవడం, చేసినా ఎస్సీలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని పథకాలకు ఉపయోగించటం పరిపాటిగా మారింది.
2021-22 బడ్జెట్ లో పెట్రోలియం, సహజ వాయువు, వాణి జ్యం, రహదారి రవాణా, హైవేలు, గనులు, బొగ్గు, ఆహారం, ప్రజా పంపిణీ, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికం శాఖలకు కేటాయించిన దళితుల అభివృద్ధి నిధులను ఆయా శాఖలు ఖర్చుచేయలేదు. ఈ నిధులు మొత్తం రూ. 950 కోట్లు ఉన్నట్టు ఆర్థికశాఖ లెక్క తెల్చిం ది. ఈ నిధులను 2022-23లో ఖర్చు చేయాలని సామాజిక న్యాయం, సాధికారితశాఖకు బదలాయించింది. ఖర్చు చేయ ని నిధులను మరో శాఖకు బదిలీకి అనుమతిస్తూ జూలై 27న ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను ఖర్చు చేయడానికి ఎస్సీ అభివృద్ధి మంత్రిత్వశాఖ నాలుగు పథకాలను గుర్తించింది.
వీటిలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కింద గుర్తించిన గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి, అంబేద్కర్ ఉత్సవ్ ధామ్ పథకం, ప్రధానమంత్రి అమృత్ జలధార కింద నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధికి, దళిత భూ యజమానులకు ఆర్థిక సహాయానికి, స్టాం డప్ ఇండియా పథకం కింద పారిశుద్ధ్య సం బంధిత సాంకేతికత రవాణా కింద సేవా కార్యకలాపాలు నిర్వహించే ఎస్సీ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాల కొనుగోలుకు వినియోగించాలని సూచించింది. దీంతో 7 రాష్ట్రాల ఎన్నికల్లో దళితుల ఓట్లు రాబట్టుకొనేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడైనా ఈ నిధులను నిజాయితీగా ఖర్చు చేస్తారా? లేదా ముందులాగే మురగబెడతారా? అని దళిత మేధావులు ప్రశ్నిస్తున్నారు.