జలమండలి అధికారులకు ఆదేశం
సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్
బంజారాహిల్స్,మార్చి 31: ఖైరతాబాద్ నియోజకవర్గంలో సీవరేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో హిమాయత్నగర్, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జలమండలి డివిజన్- 5 సీజీఎం ఆనంద్ నాయక్, జనరల్ మేనేజర్లు సంతోష్, సుబ్బారాయుడు, డీజీఎం మహేందర్రెడ్డితో పాటు డివిజన్-6 సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్ తదితరులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. మంత్రి కేటీఆర్ చొరవతో నిధులు మంజూరయ్యాయన్నారు.
హిమాయత్నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సీవరేజీ లైన్ల సామర్థ్యం పెంపు, మంచినీటి లైన్ కోసం నిధులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే బస్తీలు, కాలనీల వారీగా పర్యటించి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే దానం ఆదేశించారు. జూబ్లీహిల్స్ డివిజన్లోని ఫిలింనగర్ 18బస్తీలతో పాటు ఇందిరానగర్, గాయత్రీ హిల్స్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 46 అంబేద్కర్ నగర్ బస్తీ తదితర ప్రాంతాల్లో మొత్తం రూ. 3 కోట్లతో చేపట్టనున్న పనులను శుక్రవారం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే దానం తెలిపారు. అందుకుగాను పనులను వేగంగా ప్రారంభించేందుకు షార్ట్ టెండర్లను పిలిచి వేసవిలోగా పనులన్నీ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.