సైక్లింగ్ వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ సైక్లిస్టు బృందం సాహసోపేతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ 21న లదాఖ్ కార్గిల్ వార్ మెమోరియల్ నుంచి 13 మంది సైక్లిస్టులతో ప్రారంభమైన యాత్ర మొత్తం 3800 కిలోమీటర్లు ప్రయాణించి కన్యాకుమారి చేరుకోనున్నది. ఈ ప్రయాణంలో 2500 కిలోమీటర్లు పూర్తి చేసిన సైక్లిస్టులు గురువారం నగరానికి చేరుకోనున్నారు. కొంపల్లిలోని డెక్లథాన్ వద్ద ఉదయం 6గంటలకు ఈ యాత్రకు ఘన స్వాగతం పలుకనున్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : లదాఖ్ టూ కన్యాకుమారి 3వేల 8 వందల కిలోమీటర్లు.. సైక్లింగ్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే నినాదాన్ని ఎత్తుకుని హైదరాబాద్కు చెందిన 13 మంది రైడర్స్ సాహసోపేతమైన ‘సైక్లింగ్ రైడ్’ చేస్తున్నారు. హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆధ్వర్యంలో నవంబర్ 21న లదాఖ్ కార్గిల్ వార్ మెమోరియల్ నుంచి 13 మంది సైక్లిస్టులు రైడ్ ప్రారంభించారు. ఇందులో ఇద్దరు మహిళా రైడర్లు ఉండటం విశేషం. ఇప్పటి వరకు 2500 కిలో మీటర్ల రైడ్ విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం ఉదయం 6గంటలకు సైక్లింగ్ రైడ్ కొంపల్లిలోని డెక్లథాన్ వద్దకు చేరుకోనుంది.
నగరం మీదుగా మళ్లీ 13 వందల కిలోమీటర్ల మేర సైక్లింగ్ రైడ్ సాగనుందని హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఫౌండర్ నందనూరి రవీందర్ తెలిపారు. గమ్యస్థానం కన్యాకుమారి చేరుకున్నాక సైక్లింగ్ యాత్ర ముగియనుంది. అక్కడి నుంచి వారి వెంట ఉన్న ఎలక్ట్రిక్ సహాయక వాహనాల్లో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ సందర్భంగా రవీందర్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. సైక్లింగ్ వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని దేశానికి గుర్తు చేసేలా తాము సైక్లింగ్ రైడ్ ఎంచుకున్నామని తెలిపారు.
ఆర్మీ అధికారులు తమ రైడ్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. కార్గిల్లో తమ రైడ్ ప్రారంభానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అధికారి సచిన్ మాలిక్, డిప్యూటీ జీఓసీ జైదీప్ చంద్ర, తదితర ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా వచ్చారని తెలిపారు. దేశంలో కాలుష్యకారక వాహనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని… సైక్లింగ్ రైడ్లతో అవగాహన కల్పించాలని జీఓసీ అధికారి సచిన్ మాలిక్ తమకు సందేశమిచ్చారని వివరించారు. సైక్లింగ్ వినియోగం ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందుకు తగిన వసతులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని ఆయన కోరారు.