సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సైబర్ క్రిమినల్స్ వ్యాపారులను టార్గెట్ చేశారు. అమాయకుల ఖాతాలను కొల్లగొట్టేందుకు ఐటీ రిటర్న్ రిఫండ్ మెయిల్స్ను తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఈ మెయిల్స్లో ఫిషింగ్ లింక్లను రూపొందించి వాటిని అటాచ్ చేసి పంపుతున్నారు. అందులో ముందస్తుగానే ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ నంబర్, యూపీఐ ఐడీ నంబర్.. ఇలా బ్యాంక్ వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బును కొట్టేసేందుకు అన్ని అంశాలను ఫిషింగ్ మెయిల్లో పొందుపరుస్తున్నారు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అచ్చం ఐటీ శాఖ ముద్రలు, వారి వెబ్సైట్లో ఉండే అక్షరాలను పోలి ఉండే విధంగా లేఖను తయారు చేస్తున్నారు. ఈ మెయిల్ నిజంగానే ఐటీ శాఖ నుంచి వచ్చినట్లు బోల్తా కొట్టించేందుకు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీన్ని థర్డ్ పార్టీ నుంచి సేకరించిన ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలకు పంపిస్తున్నారు. అయితే ఇన్బాక్స్కు మెయిల్ వచ్చినప్పుడు వచ్చే అలర్ట్ కూడా అచ్చం ఐటీ అధికారులు పంపినట్లుగా ఉండటంతో చాలా మంది వాటిని నమ్ముతున్నారని సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.
రిఫండ్ వచ్చింది.. దరఖాస్తు చేసుకోండి..!
బాధితులకు ఐటీ శాఖ నుంచి వచ్చినట్లే మెయిల్ వస్తుంది. టీడీఎస్, ఐటీ రిఫండ్ నగదు మీకు వచ్చింది.. దరఖాస్తు చేసుకోండని ఆశపుట్టిస్తున్నారు. ఇది నిజమేనని న మ్ముతున్న బాధితులు ఫిషింగ్ను క్లిక్ చేసి పూర్తిగా నింపి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు.
లింక్లోని సమాచారంతో సెర్చ్..
సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ లింక్లతో సేకరించిన వివరాలతో ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాల వివరాలతో యూపీఐ ఐడీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను తెలుసుకుంటారు. అదేవిధంగా సోషల్ మీడియా ఖాతాల నుంచి మరిన్ని వివరాలు సేకరించి వాటితో అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని పకడ్బందీగా విశ్లేషించుకుంటున్న సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టాల్సిన వ్యక్తిని టార్గెట్ చేసుకుని ముందుగా వారి ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. లింక్లో వచ్చిన సమాచారంతో మెయిల్స్లోకి చొరబడి పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. మెయిల్కు వచ్చే ఓటీపీల ద్వారా ఖాతాలను కాజేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.
గుర్తుతెలియని మెయిల్స్లో భద్రం
వ్యాపారులు, ఉద్యోగులు, ఆన్లైన్లో లావాదేవీలు జరిపే వారు ఐటీ రిటర్న్, టీడీఎస్ రిఫండ్ మెయిల్స్తో పాటు గుర్తు తెలియని వారి నుంచి వచ్చే మెయిల్స్తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్లు అకస్మాత్తుగా ఆగిపోతే వెంటనే అప్రమత్తం కావాలని, మీ మెయిల్స్ను కూడా తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఐటీ అధికారులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పరు..!
ఐటీ రిటర్న్ కడుతున్న వారు, అసలు ఐటీ రిటర్న్తో సంబంధం లేని వారు మీ మెయిల్కు వస్తున్న ఐటీ రిటర్న్ మెస్సేజ్లను నమ్మవద్దని సైబర్ క్రైం పోలీసులు తెలుపుతున్నారు. ఐటీ రిటర్న్ దరఖాస్తు చేసుకోండి.. నగదు వాపసు వస్తుందనే మెస్సేజ్లకు స్పందించాల్సిన అవసరం లేదు. మీరు ఐటీ దరఖాస్తు చేసుకునే సమయంలోనే మీ ఆర్థిక లావాదేవీలతో పాటు మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఐటీ వారి వద్ద ఉంటాయి. మీకు డబ్బులు రావాల్సి ఉంటే నేరుగా మీ ఖాతాకు ఐటీ అధికారులే పంపిస్తారు. అందుకు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మెయిల్కు వచ్చిన మెస్సేజ్కు స్పందించి వివరాలు నమోదు చేయకుండా ముందుగా మీ ఆర్థిక సలహాదారులు లేదా చార్టెడ్ అకౌంటెంట్లను సంప్రదిస్తే అన్ని అనుమానాలు తీరిపోతాయి.
షేర్ మార్కెట్లో పెట్టుబడులంటూ..
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే.. లక్షలు సంపాదించవచ్చని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బీకేగూడలో నివాసముండే ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.10వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదులు తెలిపారు.
అకౌంట్ బ్లాక్ చేస్తామని..
తాము పంపిన లింక్ ఓపెన్ చేసి బ్యాంక్ ఖాతాలో వివరాలు నమోదు చేసుకోవాలని గత నెల 20న గుర్తుతెలియని నంబర్ నుంచి మెస్సేజ్ వచ్చింది. వివరాలు నమోదు చేయకుంటే అకౌంట్ బ్లాక్ చేస్తామని మెస్సేజ్లో పేర్కొన్న సైబర్ నేరగాళ్లు బంజారాహిల్స్ రోడ్నం.2 సాగర్ సొసైటీలోని సద్గురు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ ఖాతా నుంచి రూ.20వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.