బంజారాహిల్స్.మే 23: ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్(Cybercrime) ద్వారా భారీగా డబ్బులు సంపా దించవచ్చంటూ యువతిని నమ్మించి మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరికి చెందిన కే.శ్రీవల్లి అనే యువతికి ఆరునెలల క్రితం ఓ మెసేజ్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్(Workfram home) ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చని వచ్చిన మెసేజ్లోని లింక్ ద్వారా ఆమె తన పేరును రిజిస్టర్ చేసుకుంది.
ఇచ్చిన టాస్క్లు పూర్తిచేస్తూ కొంత పెట్టుబడితో నాలుగు నెలల్లో రూ.10వేలు శ్రీవల్లి సంపాదించింది. దీంతో మరింత ఎక్కువ మొత్తంలో ఆదాయం రావాలంటే రూ.92వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ మొత్తాన్ని పలు దఫాలుగా పంపించింది. డబ్బులు పంపించగానే యాప్ బ్లాక్ చేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.