సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్ సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్లో ట్రేడింగ్ గురించి…శిక్షణ పేరుతో ప్రకటనలు ఇస్తూ సైబర్నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో బడా వ్యాపారులు, ఉద్యోగులే ఎక్కువగా మోసపోతున్నారు. సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్ గురించి చెబుతూ..వాట్సాప్ లింక్లు పంపిస్తున్నారు. లింక్ క్లిక్ చేయగానే ఒక గ్రూప్ ఉంటుంది. అందులో ఉన్న వాళ్లు సైబర్నేరగాళ్లకు సంబంధించిన వాళ్లే ఉంటారు. రెండు మూడు రోజుల పాటు ఫలానా షేర్ ధర ఇంత ఉండే.. ఇక్కడ శిక్షణ తీసుకున్న తరువాత ఆ ఐడియాతో కొంటే 30 శాతం లాభాలొచ్చాయంటూ ఒకరు.. మరో రకంగా లాభాలొచ్చాయంటూ ఇంకొకరు చర్చిస్తూ కొత్తవారిని ఆకర్షిస్తుంటారు. అలా నమ్మిన వాళ్లు..ఆ చర్చల్లో పాల్గొని, మొదట కొన్ని లాభాలు తీసుకుంటారు. ఆ తరువాత వారికి నమ్మకం కుదిరాక.. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి..కోట్ల రూపాయల నష్టానికి గురవుతున్నారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మూడు రోజుల్లో రూ. 2 కోట్లకుపైగానే సైబర్నేరగాళ్లు బాధితుల వద్ద నుంచి దోచేశారు. బాధితులు ఆయా సైబర్క్రైమ్ ఠాణాల్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.
సికింద్రాబాద్కు చెందిన యువతి ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రేడింగ్ గురించి చూస్తూ..అందులో సూచించినట్లు అఫీషియల్ స్టాక్ సెక్యూరిటీ 70 వాట్సాప్ గ్రూప్లో చేరారు. అందులో ఆన్లైన్ ట్రేడింగ్పై మూడు రోజులు అవగాహన కల్గిస్తామంటూ సూచించారు. అదే గ్రూప్లో పలువురు నకిలీ వ్యక్తులు ఉండి, తాము ఫలానా షేర్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలొచ్చాయంటూ చెబుతుండటంతో సదరు యువతి తాను కూడా అందులో చేరుతానంటూ బాధితురాలు ముందుకొచ్చారు. దీంతో ఐపీఓ-హెడ్ఎఫ్సీ సెక్యూరిటీస్ పేరుతో ఒక అకౌంట్ను క్రియేట్ చేసి, స్టాక్ ట్రేడింగ్ కోసం ఏపీపీ.ఐపీఓహెచ్డీఎఫ్.కామ్ పేరుతో ఒక లింక్ పంపించారు. ఈ ఖాతాలో బాధితురాలు ఆమె తల్లి ఇద్దరు కలిసి రూ. 38,30,000 పెట్టుబడి పెట్టి మోసపోయారు.
ఫేస్బుక్లో ట్రేడింగ్కు సంబంధించిన ప్రకటనను చూసి 112 వాట్సాప్ గ్రూప్లో స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కోసం చేరాడు జిల్ల్లెలగూడకు చెందిన ఓ వ్యక్తి. డబ్ల్యూఏపీ.జీబీఎల్గోల్డ్స్.ఇన్ లింక్లో షేర్స్ కొనాలని సూచించడంతో దఫ దఫాలుగా రూ. 22,59,000 పెట్టుబడులు పెట్టి..మోసపోయాడు.
ముషీరాబాద్కు చెందిన ఒక మహిళా వ్యాపారి‘ బ్లాక్ రాక్ క్యాపిటల్’ పేరుతో ఉన్న గ్రూప్లో చేరి..రూ. 22.25 లక్షలు నష్టపోయారు.