సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఫామ్హౌస్లపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఆది, సోమవారాల్లో కమిషనరేట్ పరిధిలోని 32ఫామ్హౌజ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 ఫామ్హౌస్లను గుర్తించినట్లు సైబరాబాద్ ఎస్వోటీ అదనపు డీసీపీ నారాయణ తెలిపారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎస్వోటీ డీసీపీ రషీద్ పర్యవేక్షణలో ఫామ్హౌస్లలో ఆకస్మిక తనిఖీలు జరుపుతున్నట్లు చెప్పారు. రెండు రోజులు మొత్తం 32 ఫామ్హౌస్లను తనిఖీ చేయగా, మొయినాబాద్ పీఎస్ పరిధిలోని బిగ్బాస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ ఫామ్హౌస్లలో అంసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు.
శంషాబాద్ పీఎస్ పరిధిలోని రిపుల్జ్ ఫామ్హౌస్లో అనుమతి లేకుండా మద్యం, హుక్కా తాగుతున్నట్లు గుర్తించామని, మేడ్చల్ పీఎస్ పరిధిలోని గోవర్ధన్రెడ్డి ఫామ్హౌస్లో ఏడుమంది పేకాట ఆడుతూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయినట్లు తెలిపారు.4ఫామ్హౌస్లలో మొత్తం 25మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1, 03,030ల నగదు, 7సెల్ఫోన్స్, 10 హుక్కా పాట్స్, హుక్కా పైప్స్, 17రకాల ఫ్లేవర్స్ తదితరాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్వోటి అదనపు డీసీపీ నారాయణ వెల్లడించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు 9490617444కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.