సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): డేటాచోరీ కేసులో సైబరాబాద్ సిట్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులు 89కోట్ల మందికి చెందిన డేటాను అక్రమ మార్గంలో తస్కరించి విక్రయాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 21 సంస్థలకు సిట్ అధికారులు నోటీసులు జారీచేయగా తాజాగా మరో 4 కంపెనీలకు నోటీసులు జారీచేసినట్లు తెలిసింది.
ఇందులో 8 సంస్థలకు చెందిన ప్రతినిధులు పోలీసుల విచారణకు హాజరవుతున్నట్లు సమాచారం. అందులో బ్యాంకింగ్ రంగ సంస్థలు, ఈ-కామర్స్, టెలీ-కాలర్స్ తదితర సంస్థలు ఉన్నట్లు తెలిసింది. మరో పక్క డిఫెన్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన అత్యంత కీలకమైన సంస్థలకు చెందిన డేటా సైతం చోరీ జరగడంపై అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో సున్నితమైన అంశాలపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.