జూబ్లీహిల్స్, డిసెంబర్ 31 : నిరాశ్రయులైన పిల్లలు, బాల కార్మికులను రక్షించడానికి జనవరి 1 నుంచి 31 వరకు సైబరాబాద్ పోలీసులు ఆపరేషన్ స్మైల్-ఎక్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు శనివారం సీపీ కార్యాలయంలో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. రోడ్లపై బిక్షాటన చేస్తూ, కూడళ్లలో వస్తువులు విక్రయిస్తూ ఉన్నవారితో పాటు అక్రమ రవాణాలో చిక్కుకున్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పించేందుకు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్తో 11 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ డబ్ల్యూఅండ్ సీఎస్డబ్ల్యూ డీసీపీ ఎల్సీ నాయక్ తెలిపారు.
మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ కె.నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ, వైద్య ఆరోగ్య, కార్మిక శాఖల అధికారులు పాల్గొన్నారు.